ఇంట్లోని బియ్యం మూటలో త్వరగా పురుగులు పట్టేస్తున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే పురుగులు చేరవు…

బియ్యం, పప్పులు ఎక్కువ కాలం పాటు ఇంట్లోనే ఉంటే వాటికి పురుగులు పట్టేస్తాయి. బియ్యానికి మాత్రం చాలా తక్కువ సమయంలోనే పురుగులు పట్టే అవకాశం ఉంది.


వాటిని పదేపదే శుభ్రం చేసుకోవడం కూడా కష్టమే. అసలు వాటికి పురుగులే పట్టకుండా చూసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు కదా. బియ్యం లేదా పప్పులు కొని తెచ్చాక చిన్న చిట్కాలు పాటించడం ద్వారా వాటికి పురుగులు పట్టకుండా కాపాడుకోవచ్చు.

పురుగులు ఎందుకు పడతాయి?

అసలు బియ్యానికి ఎందుకంత త్వరగా పురుగులు పడతాయి? అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ పురుగులు నివసించడానికి అనువైన వాతావరణం ఉంటే చాలు బియ్యంలో కాపురం మొదలుపెట్టేస్తాయి. పిల్లలు పెట్టి సంతతి పెంచేస్తాయి. పంటలు కోసి ఆహార ప్రాసెసింగ్ కేంద్రానికి తీసుకెళ్లేటప్పుడు వాటిలో కొన్ని పురుగులు ఉండే అవకాశం ఉంది. ప్రాసెసింగ్ అంతా అయ్యాక బియ్యాన్ని మూటల్లో కట్టి అమ్మేస్తారు. ఆ మూటలో ఒక్క పురుగు ఉన్న చాలు, అనువైన వాతావరణం రాగానే తమ జనాభాను పెంచే పనిలో ఉంటాయి. అలా బియ్యానికి పురుగులు అధికంగా పట్టేస్తాయి. అలాగే తడి తగిలినా బియ్యానికి పురుగు పట్టే అవకాశం ఉంది. అందుకే గాలి చొరబడని, తడి తగలని కంటైనర్లలో బియ్యాన్ని నిల్వ ఉంచుకోమని చెబుతారు. బియ్యంలో కొన్ని రకాల పదార్థాలు కలపడం ద్వారా పురుగులను నివారించవచ్చు.

బిర్యానీ ఆకులు

బియ్యానికి పట్టిన పురుగులను వదిలించుకోవడానికి ఇది ఉత్తమ మార్గం. మీరు చేయాల్సిందల్లా బియ్యం కంటైనర్లో ఆరేడు బిర్యానీ ఆకులను ఉంచండి. బియ్యం ఎక్కువ మొత్తంలో ఉంటే ఎక్కువ బిర్యానీ ఆకులను కలపండి. గాలి చొరబడకుండా బియ్యం మూటను కట్టేయండి.

లవంగాలు

బలమైన సువాసన గల ఈ సుగంధ ద్రవ్యాలు బియ్యానికి పురుగులు పట్టకుండా అడ్డుకుంటాయి.వంట గదిలో సూక్ష్మక్రిములు లేకుండా నివారించడంలో లవంగాలు ముందుంటాయి. లవంగం నూనెను స్ప్రే చేసినా కూడా పురుగులు పట్టవు.

వెల్లుల్లి

ప్రతి ఇంట్లో లభించే అత్యద్భుతమైన పదార్థం వెల్లుల్లి. దీన్ని పొట్టు తీశాక బియ్యంలో కలిపేయాలి. అలా బియ్యం వాడినంత కాలం వాటిని అలానే ఉంచుకోవచ్చు. పురుగులు వెల్లుల్లి ఉన్నచోట ఆ ఘాటుకు ఉండలేవు.

ఎక్కువగా పురుగులు పడితే బియ్యాన్ని సూర్య కాంతిలో ఎండబెట్టాలి. అలా అని మరీ ఎర్రటి ఎండలో ఎండబెడితే, గింజలు విరిగిపోయి నూకల్లా తయారవుతాయి. కాబట్టి సూర్యకాంతి తగిలేటట్టు ఒక షీట్ మీద విస్తరించి ఎండబెట్టండి. పురుగులన్నీ పోయాక గాలి చొరబడని కంటైనర్లో వేసి ప్యాక్ చేయండి. ప్రతి రెండు నెలలకు ఒకసారి బియ్యం, ఇతర ధాన్యాలు, పప్పులు ఇలా ఎండలో ఉంచడం మంచిది.అగ్గిపెట్టెతో కూడా పురుగులను అడ్డుకోవచ్చు. ఇది మీకు వింతగా అనిపిస్తున్నా నిజమే. ఎందుకంటే అగ్గిపెట్టెల్లో సల్ఫర్ ఉంటుంది. బియ్యం మూటలో అగ్గిపెట్టెలను తెరిచి ఉంచండి. ఆ చుట్టుపక్కల ఎక్కడా పురుగులు కనిపించవు. అలాగే నల్ల మిరియాలు చల్లడం ద్వారా పురుగులు పట్టకుండా చూసుకోవచ్చు. బియ్యంలో అల్లం ముక్క, పసుపును కలపడం ద్వారా పురుగులను పారద్రోలవచ్చు.