అమెరికాలో విద్యార్థులు ప్రపంచ ప్రభావిత అంశాలపై తమ అభిప్రాయాలను చెప్పడానికి ఏ మాత్రం వెనుకాడరు. ఇలా ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) లో చదివిన మేఘా వేమూరి తన గ్రాడ్యూయేషన్ డే సందర్భంగా ఇచ్చిన స్పీచ్ లో ఇజ్రాయెల్ అంశాన్ని ప్రస్తావించడం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
భారతీయ-అమెరికన్ విద్యార్థిని మేఘా వేమూరి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) 2025 గ్రాడ్యుయేషన్ క్లాస్ ప్రెసిడెంట్. తన గ్రాడ్యుయేషన్ ప్రసంగంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలను “జెనోసైడ్”గా విమర్శించారు. అంతే కాదు తాను చదువుకున్న MIT ఇజ్రాయెల్ సైనిక సంస్థలతో రీసెర్చ్ సంబంధాలను ఖండిస్తూ చేసిన ప్రసంగం వైరల్గా మారింది.
మేఘా వేమూరి తన ప్రసంగంలో గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలను “జెనోసైడ్”గా అభివర్ణించింది, ఇజ్రాయెల్ “పాలస్తీనాను భూమి నుండి తుడిచివేయడానికి ప్రయత్నిస్తోంది” అని ఆరోపించారు. MIT ఇజ్రాయెల్ సైనిక సంస్థలతో రీసెర్చ్ సంబంధాలను కొనసాగిస్తోందని, ఇది గాజాలో జరుగుతున్న హింసకు సహాయం చేస్తుందని ఆమె విమర్శించారు. మేఘా వేమూరి ఒక ఎరుపు కెఫీయా (పాలస్తీనా సంఘీభావ చిహ్నం) ధరించి గ్రాడ్యూయేషన్ డేకు వచ్చారు.
MIT యాజమాన్యం ప్రో-పాలస్తీనా ఉద్యమకారులను “బెదిరింపులు, భయపెట్టడం , అణచివేత” ద్వారా అడ్డుకుందని మేఘా వేమూరి ఆరోపించారు. అయినప్పటికీ, విద్యార్థులు తమ నిలువను కాపాడుకున్నారని ఆమె ప్రశంసించాు. “మనం గ్రాడ్యుయేషన్కు సిద్ధమవుతూ మన జీవితాలను ముందుకు తీసుకెళ్తున్నప్పుడు, గాజాలో ఇప్పుడు ఒక్క విశ్వవిద్యాలయం కూడా మిగలలేదు” అని ఆమె ఆవేదనతో చెప్పారు.
ప్రసంగం సమయంలో ఆమె గ్రాడ్యుయేట్లను MIT ఇజ్రాయెల్ సైనిక సంస్థలతో సంబంధాలను తెంచుకోవాలని డిమాండ్ చేయమని కోరింది. ఆమె సాంప్రదాయ MIT క్లాస్ రింగ్ను బయటకు తిప్పమని కోరింది. దీనికి గ్రాడ్యుయేట్ల నుంచి మద్దతు లభించింది. మేఘా వేమూరి ప్రసంగం ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణపై బలమైన రాజకీయ వ్యాఖ్యలతో ఉంది. ఇజ్రాయెల్ చర్యలను “జెనోసైడ్”గా పిలవడం , MIT యొక్క రీసెర్చ్ సంబంధాలను విమర్శించడం సోషల్ మీడియాలో విభిన్న చర్చలకు కారణం అయింది. MIT, ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలలో ఒకటి.అయితే మేఘా వేమూరి ప్రసంగం దాని సంస్థాగత విధానాలపై విమర్శలను లేవనెత్తడం ద్వారా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.
మేఘా వేమూరి జార్జియాలోని ఆల్ఫారెట్టాలో పుట్టి పెరిగిన భారతీయ సంతతికి చెందిన విద్యార్థిని. ఆమె తల్లిదండ్రులు తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు వెళ్లారు. ఆమె 2021లో ఆల్ఫారెట్టా హైస్కూల్ నుండి గ్రాడ్యుయేట్ చేసింది . MITలో కంప్యూటర్ సైన్స్, న్యూరోసైన్స్, , లింగ్విస్టిక్స్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. MITలో క్లాస్ కౌన్సిల్లో సభ్యురాలిగా .. మెక్గోవర్న్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్లో రీసెర్చ్ అసిస్టెంట్గా వ్యవహరించారు. జోర్డాన్లోని హైస్కూల్ విద్యార్థుల కోసం న్యూరోసైన్స్ కరికులమ్ అభివృద్ధి చేసింది. 2021లో ఆమె నేషనల్ మెరిట్ స్కాలర్ అవార్డు పొందింది