కొంతమంది స్వీట్ రెసిపీలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే, ఎప్పుడూ ఒకే రకమైనవి కాకుండా అప్పుడప్పుడు కొత్తరకం స్వీట్స్, పొరుగు రాష్ట్రాల మిఠాయిలను టేస్ట్ చేయాలని కోరుకుంటారు. అలాగే, ఆగస్టు 27 బుధవారం నుంచి గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే మీకోసం ఒక అద్భుతమైన స్వీట్ రెసిపీని తీసుకొచ్చాం. అదే, మణిపుర్ స్పెషల్ నోరూరించే “మధురజన్ థోంగ్బా”. దీని పేరు వినడానికి వెరైటీగా ఉన్నట్లే టేస్ట్ కూడా డిఫరెంట్గా, భలే కమ్మగా ఉంటుంది. అలాగే, ఇవి గులాబ్ జామూన్లా ఎక్కువ తీపి కూడా ఉండవు. పైగా వీటిని తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. రెగ్యులర్ రెసిపీలను మంచిన టేస్ట్తో వావ్ అనిపించే ఈ మిఠాయిలు ఇంటిల్లిపాదీకి చాలా బాగా నచ్చుతాయి. మరి, వినాయక చవితి వేళ మీరు కూడా ఓసారి ఈ మణిపుర్ స్పెషల్ “మిఠాయి”ని ట్రై చేయండి.
మధురజన్ థోంగ్బా స్వీట్కి కావాల్సినవి :
- కప్పున్నర – పాలు
- బాదం, జీడిపప్పు పలుకులు, పుచ్చగింజలు – అన్నీ కలిపి గుప్పెడు
- అర చెంచా – యాలకుల పొడి
- కొద్దిగా – కుంకుమ పువ్వు
- ఆరు చెంచాలు – పంచదార(తగినంత)
- ఒకటి – బిర్యానీ ఆకు
- ఒక కప్పు – శనగపిండి
- అర చెంచా – బేకింగ్ సోడా
- రెండు చెంచాలు – సన్నని కొబ్బరి ముక్కలు
- రెండు చెంచాలు – కిస్మిస్లు
- ఒక కప్పు – నూనె
-
తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా రెండు చెంచాల పరిమాణంలో సన్నని పచ్చికొబ్బరి ముక్కలను రెడీ చేసుకొని పక్కనుంచాలి. అలాగే, బాదం, జీడిపప్పులను సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి, బేకింగ్ సోడా, ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని కొబ్బరి ముక్కలు, కిస్మిస్లు వేసుకోవాలి. ఆపై అందులో తగినన్ని నీళ్లు పోసుకొని చిక్కటి పిండి మిశ్రమంలా కలుపుకొని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
- ఆలోపు స్టవ్ మీద ఒక గిన్నెలో పాలను తీసుకొని మరిగించుకోవాలి. పాలు లైట్గా వేడయ్యాక అందులో పంచదార, యాలకుల పొడి, బిర్యానీ ఆకు, కుంకుమ పువ్వు, సన్నగా కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు పలుకులు, పుచ్చ గింజలు ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని కలిపి పాల మిశ్రమాన్ని బాగా మరిగించుకోవాలి.
- అనంతరం స్టవ్ మీద మరో బర్నర్పై ఒక కడాయిలో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మంటను తగ్గించి అందులో ముందుగా కలిపి పావుగంట పాటు పక్కనుంచిన శనగపిండి మిశ్రమాన్ని చేతితో కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండల్లా నెమ్మదిగా కాగుతున్న నూనెలో వేసుకోవాలి.
- పాన్లో వేయించడానికి సరిపడా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి.
- అవి రెండు వైపులా చక్కగా వేగిన తర్వాత బయటకు తీసి మరో బర్నర్ మీద మరుగుతున్న పాల మిశ్రమంలో వేసుకోవాలి.
- పాల మిశ్రమంలో వేసిన తర్వాత వాటన్నింటిని మరో నాలుగు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. అంతే, కమ్మని రుచితో వావ్ అనిపించే మణిపుర్ స్పెషల్ “మధురజన్ థోంగ్బా” స్వీట్ రెడీ అయిపోతుంది!
































