సింపుల్గా, అప్పటికప్పుడు చేసుకునే రెసీపీల్లో ఎగ్ కర్రీ ఒకటి. దీనిని ఎప్పుడూ ఒకే విధంగా తినాలన్నా బోర్ కొడుతుంది. అందుకే ఇవాళ కొత్త రెసిపీని తీసుకొచ్చాం. అదే మొఘలాయి ఎగ్ కర్రీ. ఈ రెసిపీ అన్నం, పులావ్ రోటీ, ఇలా దేనికైనా సూపర్ కాంబినేషన్. దీనిని నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో ఓసారి చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు. మరి, మొఘలాయి స్టైల్లో ఘుమఘుమలాడే ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు ఓ లుక్కేయండి.
కావాల్సిన పదార్థాలు :
- కోడిగుడ్లు – 6
- వెన్న – పావు కప్పు
- ఉల్లిపాయలు – 2
- జీడిపప్పులు – 15
- టమోటాలు – 2
- పాలు – అర కప్పు
- నూనె – పావు కప్పు
- గరం మసాలా – ఒక స్పూన్
- తాజా క్రీమ్ – పావు కప్పు
- పచ్చిమిర్చి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
- అల్లంవెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
- పసుపు – ఒక స్పూన్
- ఉప్పు – రుచికి సరిపడా
- కారం – ఒకటిన్నర స్పూన్
- ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్
- కస్తూరి మెంతి – ఒక స్పూన్
-
తయారీ విధానం :
- ముందుగా స్టవ్ ఆన్ చేసి ఓ గిన్నెలో 6 ఎగ్స్ తీసుకుని తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి.
- మరోవైపు ఉల్లిపాయ, టమోటాలను సన్నగా కట్ చేసుకోవాలి . అలాగే, పచ్చిమిర్చి పేస్ట్ని తయారు చేసుకోవాలి.
- ఇప్పుడు ఉడికించిన గుడ్ల పైన పొట్టును తొలగించుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి పాన్లో రెండు స్పూన్ల నూనె పోయాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమోటా ముక్కలు, 15 జీడిపప్పులు వేసి ఫ్రై చేయాలి.
- టమోటా ముక్కలు వేగుతున్నప్పపుడు పావు స్పూన్ ఉప్పు కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
- చల్లారిన తర్వాత ఉల్లిపాయ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి.
- అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని మిగిలిన నూనె, పావు కప్పు వెన్న వేయాలి. ఇవి కాస్తా వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
- అలాగే ఒక స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒకటిన్నర స్పూన్ కారం యాడ్ చేయాలి. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి.
- ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ మిశ్రమాన్ని జత చేసి ఒకసారి కలపాలి. ఆయిల్ సేపరెట్ అయ్యేంత వరకు ఉంచాలి.
- అనంతరం అరకప్పు నీళ్లు, అర కప్పు పాలు, పావు కప్పు తాజా క్రీమ్ వేసి అంతా బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మూతపెట్టాలి. మిశ్రమం కాస్త దగ్గరపడి లైట్గా నూనె సెపరేట్ అయ్యే వరకు ఉడికించాలి.
- ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ను ముక్కలుగా చేసి వేసుకోవాలి.
- చివరలో ఒక స్పూన్ కస్తూరి మెంతి చేతితో నలిపి వేసుకోవాలి. ఇదంతా కలిసేలా కలిపి ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి.
- ఇక అంతే వేడివేడి మొఘలాయి ఎగ్ కర్రీ రెడీ అయినట్లే!
































