Nalgonda: మాస్టారూ.. మీరే మీరే మాస్టారు!

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో 39 ఏళ్లు వ్యాయామోపాధ్యాయునిగా పనిచేసిన తూము హన్మంతరావు చివరిగా సూర్యాపేట జిల్లా నూతనకల్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తూ శనివారం ఉద్యోగ విరమణ పొందారు.


ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో 39 ఏళ్లు వ్యాయామోపాధ్యాయునిగా పనిచేసిన తూము హన్మంతరావు చివరిగా సూర్యాపేట జిల్లా నూతనకల్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తూ శనివారం ఉద్యోగ విరమణ పొందారు. ఆయన శిష్యుల్లో చాలామంది ఏసీపీ, డీఎస్పీ, మున్సిపల్‌ కమిషనర్, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, వ్యాయామోపాధ్యాయులు, పోలీస్‌ కానిస్టేబుళ్లు సహా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కొందరు ప్రజాప్రతినిధులుగానూ ఎదిగారు. వారంతా కలిసి నూతనకల్‌ పాఠశాల నుంచి 3 కి.మీ. దూరంలో ఉన్న గుండ్లసింగారం ఫంక్షన్‌హాలులో శనివారం గురువుకు సన్మాన సభ నిర్వహించారు. ఆ పాఠశాల నుంచి హన్మంతరావు, పుష్పలత దంపతులను తీసుకెళ్తున్న వాహనాన్ని శిష్యులైన సుమారు 200 మంది పూర్వవిద్యార్థులు తాడుతో లాగుతూ ఫంక్షన్‌హాలు వరకు తీసుకెళ్లి వినూత్నంగా గురుదక్షిణ చెల్లించుకున్నారు. అనంతరం దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ వాసుదేవ్, ఎల్బీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగమల్లు మాట్లాడుతూ.. తాము పోలీసు ఉద్యోగానికి ఎంపిక కావడానికి హన్మంతరావు ఇచ్చిన శిక్షణే కారణమని పేర్కొన్నారు.