Post Office Jobs: పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు.. త్వరలో నోటిఫికేషన్‌! రాత పరీక్షలేకుండానే ఎంపిక

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 2024-25 సంవత్సరానికిగానూ గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) పోస్టుల భర్తీకి ఇండియన్‌ పోస్ట్‌ సమాయాత్తం అవుతోంది. ఇందుకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది జనవరిలో దాదాపు 40 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది కూడా వేల పోస్టులతో నోటిఫికేషన్‌ వెలువడాల్సి ఉంది. రాత పరీక్ష లేకుండానే కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగ అభ్యర్ధులకు పదేళ్ల వరకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.


పదో తరగతి మార్కుల ఆధారంగా మాత్రమే ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారిని బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌.. హోదాలో విధులు సంబంధిత కార్యాలయంలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు ప్రారంభ వేతనం అందజేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులు రోజుకు నాలుగు గంటలు మాత్రమే పని గంటలు ఉంటాయి. వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌ విధులను కూడా నిర్వహించవచ్చు. ఇందుకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో ప్రోత్సాహం అందిస్తారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్ లో చెక్‌ చేసుకోవచ్చు.