AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?

WhatsApp channelJoin Now
Telegram Group Join Now

ఏపీలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఇప్పటివరకు 16 డీఎస్సీ నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఇందులో 13 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వెలువడగా.. తెలంగాణ విడిపోయాక 3 పర్యాయాలు నోటిఫికేషన్లు జారీచేశారు.
AP DSC Details: ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఇప్పటివరకు 16 డీఎస్సీ నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఇందులో 13 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వెలువడగా.. తెలంగాణ విడిపోయాక 3 పర్యాయాలు నోటిఫికేషన్లు జారీచేశారు. అయితే అంతకు ముందు 1977, 1978, 1982 డీఎస్సీలు నిర్వహించినప్పటికీ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్, 1982 అమల్లోకి వచ్చాక మొదటి డీఎస్సీ నోటిఫికేషన్ ఎన్టీఆర్ హయాంలో 1984లో వెలువడింది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కోట్ల విజయ భాస్కర రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలలో నోటిఫికేషన్లు వెలువడగా.. చివరగా కిరణ్ కుమార్ రెడ్డి 2012లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014, 2018లలో డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేశారు.

ఎన్టీఆర్‌తో ప్రారంభం..
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మొదటిసారి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుంది. ఎన్టీఆర్ తన పదవీకాలంలో 1984, 1986, 1989 సంవత్సరాల్లో మొత్తం 3 డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఆ తర్వాత కోట్ల విజయ భాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో 1994లో డీఎస్సీ నోటిఫికేట్ వెలువడింది.


చంద్రబాబు రికార్డు..
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో అత్యధికత డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసిన సీఎంగా చంద్రబాబు నాయుడు ఘనత సాధించారు. ఈయన ఏలుబడిలో మొదటిసారి 8 సంవత్సరాల్లో 6 నోటిఫికేషన్లు, రెండో పర్యాయం రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2019 మధ్యకాలంలో 2సార్లు డీఎస్సీ నోటిఫికేషన్లు వెలువడ్డాయి. మొత్తంగా చూస్తే చంద్రబాబు జమానాలో 1996, 1998, 2000, 2001, 2002, 2003, 2014, 2018 సంవత్సరాల్లో నోటిఫికేషన్లు వెలువడ్డాయి.

➥ ఇక 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 2006, 2008లో రెండు డీఎస్సీ నోటిఫికేష్లను విడుదల చేసింది. 2009లో ఆయన మరణాంతరం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2012లో DSC నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువడిన చిట్టచివరి డీఎస్సీ నోటిఫికేషన్.

రాష్ట్రవిభజన తర్వాత.. వేర్వేరుగా..

➥ 2014లో ఏపీ నుంచి తెలంగాణ విడిపోయాకా.. రెండు ప్రభుత్వాలు డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2014, 2018 సంవత్సరాల్లో నోటిఫికేషన్లు విడుదల చేయగా..ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎన్నికల ఏడాదిలో 2024లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు.

➥ ఇక తెలంగాణలోను రెండుసార్లు డీఎస్సీ నోటిఫికేషన్లు వెలువడ్డాయి. 2018లో కేసీఆర్ ప్రభుత్వం డీఎస్సీని టీఆర్టీగా నిర్వహించింది. ఆ తర్వాత 2023 చివరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఎన్నికల కారణంగా పరీక్షలు వాయిదావేశారు. ఫలితాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొత్త ప్రభుత్వం డీఎస్సీ 2023 నోటిఫికేషన్ రద్దుచేసి, డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

➥ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో టెట్, డీఎస్సీ పరీక్షల వాతావరణం నెలకొంది. ఏపీలో టెట్ పరీక్షలు నిర్వహించగా.. డీఎస్సీ కోసం షెడ్యూలు విడుదలైంది. ఎన్నికల షెడ్యూలుతో పరీక్షలు వాయిదాపడే అవకాశం కనిపిస్తుంది.

➥ ఇక తెలంగాణలో టెట్ కంటే ముందు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో డీఎస్సీ కంటే ముందుగానే టెట్ నిర్వహించాల్సిందిగా కోర్టుల ఆదేశించింది. దీంతో అప్పటికప్పుడు టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం టెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *