స్కూల్, జూనియర్ మరియు డిగ్రీ టీచర్ ప్రవేశ పరీక్షలలో టాపర్లు వీరే

2025-26 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఆర్‌ఎస్‌ సెట్, ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ సెట్‌ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో విజయనగరం జిల్లాకు చెందిన విద్యార్ధి ఐదో తరగతిలో స్టేట్ టాపర్..

ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఆర్‌ఎస్‌ సెట్, ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ సెట్‌ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఫలితాలు మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌లో ప్రకటించారు. ఈ మేరకు ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ (APREIS) ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అన్ని విభాగాల్లో 7,190 సీట్లకు 62,047 మంది విద్యార్థులు పోటీ పడ్డారు.


ఐదో తరగతిలో 3920 సీట్లకు 14,061 మంది పోటీ పడగా, 6, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్లకు ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. అలాగే ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో 1425 సీట్లకు 41,215 మంది, డిగ్రీ మొదటి సంవత్సరంలో 220 సీట్లకు 1,018 మంది ఈ పరీక్షలు రాశారు. పరీక్ష రాసిన విద్యార్ధులు అందరికీ ర్యాంకులు ప్రకటించారు.కాగా ఏప్రిల్‌ 25న ఉదయం 5, 6, 7, 8 తరగతుల ప్రవేశాలకు ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ కామన్ అడ్మిషన్‌ టెస్ట్‌ నిర్వహించగా.. మధ్యాహ్నం ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ 2025 ప్రవేశ పరీక్షలు నిర్వహించింది. పాఠశాలలకు ఎంపికైన విద్యార్థుల జాబితాతో పాటు జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ త్వరలో వెల్లడిస్తామని ఏపీఆర్‌ఈఐ సొసైటీ కార్యదర్శి వీఎన్‌ మస్తానయ్య తెలిపారు.

టాపర్లు వీరే..

ఐదో తరగతిలో వజ్రపు శశికుమార్‌ (విజయనగరం జిల్లా), ఆరో తరగతి గొల్లంగి మౌనిక (శ్రీకాకుళం జిల్లా), ఏడో తరగతిలో కర్రా తనీశి శ్రీవర్షిణి (అనకాపల్లి జిల్లా), ఎనిమిదో తరగతి వల్లూరి రిచా (తూర్పు గోదావరి జిల్లా) మొదటి స్థానంలో నిలిచారు.

ఇంటర్మీడియట్‌లో టాపర్లు..

  • ఎంపీసీ గ్రూపులో బాలినేని కళ్యాణ్‌ రామ్‌ (విశాఖ జిల్లా)
  • బైపీసీ గ్రూపులో బొడ్డుపల్లి మనోజ్‌ కుమార్‌ (రాజమండ్రి రూరల్‌)
  • ఎంఈసీ/సీఈసీ గ్రూపులో మాదివాడ వేదాశ్రిత (తూర్పు గోదావరి జిల్లా)
  • ఈఈటీ గ్రూపులో దగరి సాయి చరణ్‌ (తూర్పు గోదావరి జిల్లా)
  • సీజీటీ గ్రూపులో సరికి చరణ్‌ (తూర్పు గోదావరి జిల్లా)

డిగ్రీలో టాపర్లు..

  • బీఏ గ్రూపులో కోటకొండ విజయుడు (కర్నూలు జిల్లా)
  • బీకామ్‌ గ్రూపులో చిన్నబసప్పగారి బసవరాజు (అనంతపురం జిల్లా)
  • బీఎస్సీ (కెమిస్ట్రీ) గ్రూపులో అడపా విజయ్‌ (శ్రీకాకుళం జిల్లా)
  • బీఎస్సీ (డేటా సైన్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌) గ్రూపులో కల్వటాల కిరీటి (నంద్యాల జిల్లా)
  • బీఎస్సీ (జువాలజీ) గ్రూపులో వంతల శ్రీకాంత్‌ (అల్లూరి సీతారామరాజు)
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.