Upma History: ఇప్పుడు మనం తింటున్న ఉప్మా అంతా ఒకప్పటి చెత్తే, తెల్లోడు చేసిన అతి పెద్ద మోసం ఇది

ఉప్మా కేవలం అల్పాహారం మాత్రమే కాదు. దాని చుట్టూ ఎన్నో రాజకీయాలున్నాయి. మరెన్నో ఆర్థిక కోణాలూ ఉన్నాయి. చెప్పాలంటే అందులో మన బానిసత్వం కనిపిస్తుంది. కాస్తంత అతిశయోక్తి అనిపించినా అసలు కథ తెలిస్తే అదంతా నిజమే అని అర్థమవుతుంది.


ఉప్మా కథ ఇది..

Upma అనే పేరు uppu mavu అనే తమిళ పదాల నుంచి పుట్టింది. అంటే ఉప్పగా ఉండే పిండి అని అర్థం. పిండిలో నీళ్లు పోసి కాస్తంత ఉప్పు వేసుకుని వండుకునే వాళ్లు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. కర్ణాటకలో ఉప్పిట్టు అని, ఆంధ్రప్రదేశ్లో ఉప్పుడు పిండి అని కూడా పిలుస్తారు. 18వ శతాబ్దంలోనే మనకి ఈ వంటకం (Rava Upma) పరిచయం అయింది. ఈ ఉప్మా పుట్టుక వెనక పెద్ద చరిత్రే ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మద్రాస్ ప్రెసిడెన్సీలోని బియ్యం నిల్వలన్నింటినీ బ్రిటీష్ వాళ్లు తమ సైనికుల కోసం ఎగుమతి చేసుకున్నారు. ఫలితంగా సౌత్లో బియ్యం దొరక్కుండా పోయింది. ఈ సమస్యని తీర్చేందుకు అప్పటికప్పుడు బర్మా నుంచి దిగుమతి చేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో బర్మాపై జపాన్ దాడి చేసింది. ఫలితంగా రైస్ ఇంపోర్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. రెస్టారెంట్లు అన్నీ మూతపడ్డాయి. అప్పుడే బ్రిటీష్ పాలకులు చాలా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నారు. సౌత్ ఇండియన్స్ని ఎలాగైనా కన్విన్స్ చేయాలని పంజాబ్ నుంచి గోధుమలను దిగుమతి చేసుకోవాలని చూసింది. కానీ ఇక్కడ ఓ సమస్య వచ్చి పడింది. గోధుమలను తీసుకొచ్చినా వాటిని పిండి పట్టించి చపాతీలు చేసుకునేందుకు స్థోమత అప్పట్లో దక్షిణాది ప్రజలకు లేకుండా పోయింది.

చెత్త నుంచి పుట్టిన టిఫిన్..

సింపుల్గా వండుకునేలా ఏముంటుందని ఆలోచిస్తే ఫ్లోర్ మిల్లుల్లో (How Upma is Invented) పిండి పట్టగా మిగిలిపోయిన రవ్వపై వాళ్ల దృష్టి పడింది. ఓ రకంగా అది చెత్త లాంటిదే. కాకపోతే వండుకోడానికి సులువుగా ఉంటుందని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నారు. పైగా ఇది చాలా ఆరోగ్యకరమైన ఆహారం అంటూ ప్రచారం చేశారు. ఆకలి నుంచి బయటపడాలంటే ఇదే మంచిదంటూ ఊదరగొట్టారు. అంతే కాదు. ఈ రవ్వని ఎలా వండుకోవాలో ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇచ్చారు. రెస్టారెంట్లకూ సప్లై చేశారు. అలా క్రమంగా అందరికీ ఈ ఉప్మాని అలవాటు చేశారు. అప్పటికి అందరికీ అదే పంచభక్ష్య పరమాన్నమైపోయింది. అప్పట్లో MTR (Mavalli Tiffin Room) అధినేత యజ్ఞనారాయణ మయ్యా రవ్వ ఇడ్లీని పరిచయం చేశారు. మద్రాస్ రెసిడెన్సీలో రెస్టారెంట్లలో పొంగల్కి బదులుగా అప్పటి నుంచి రవ్వ ఇడ్లీ సర్వ్ చేయడం మొదలు పెట్టారు. అది కాస్తా ఫేమస్ అయిపోయింది. అలా మొదలైన ఈ ఉప్మా ప్రస్థానం ఇక్కడి వరకూ వచ్చింది. రకరకాల ఉప్మాల రెసెపీలు ఇప్పుడు వచ్చేసినా ఎక్కడో మనలో తెలియకుండానే దానిపై విరక్తి వచ్చేసింది. ఎంత స్పైసీగా చేసుకున్నా మసాలా తగలదు కాబట్టి చప్పటి తిండిగానే మిగిలిపోయింది. నచ్చినా నచ్చకపోయినా తిన్నా తినకపోయినా ఇప్పటికీ కిచెన్ని రూల్ చేసేస్తోంది ఉప్మా.