AP High court: వాసుదేవరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వాసుదేవరెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 18కి వాయిదా వేసింది.


అమరావతి: కీలక డాక్యుమెంట్లు మాయం చేశారని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ మాజీ ఎండీ, ఐఆర్‌టీఎస్‌ అధికారి డి.వాసుదేవరెడ్డిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా.. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వాసుదేవరెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 18కి వాయిదా వేసింది. వాసుదేవరెడ్డికి మధ్యంతర బెయిల్‌ ఇవ్వొద్దని సీఐడీ తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. అనంతరం పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన కోర్టు.. ఈ లోపు అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది.

ఏపీఎస్‌బీసీఎల్‌ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్‌ పరికరాలు, ఇతర పత్రాలను వాసుదేవరెడ్డి ఈ నెల 6న కారులో తరలిస్తుండగా చూశానంటూ.. కంచికచర్ల వాసి గద్దె శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ కేసు పెట్టింది. విలువైన ఆధారాలు, వస్తువుల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలపై ఐపీసీ 427, 379 రెడ్‌విత్‌ 120బీ సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది.