పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా సీప్లేన్ సేవలను అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం అవసరమైన వాటర్ ఎయిర్ పోర్టుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం జలాశయం, నాగార్జున సాగర్తోపాటు విశాఖపట్నం సముద్ర తీరప్రాంతంలోనూ వాటర్ ఎయిర్పోర్టులు ఏర్పాటు చేయవచ్చని రాష్ట్ర ఎయిర్పోర్ట్స్ డెవల్పమెంట్ కార్పొరేషన్ (ఏపీఏడీసీ) సీఎం చంద్రబాబుకు ప్రతిపాదనలు సమర్పించింది. సీప్లేన్ సేవలు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతాల్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని, తద్వారా రాష్ట్రానికి ఆదాయంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో వాటర్ ఎయిర్పోర్టుల ఏర్పాటులో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఏపీఏడీసీకి ముఖ్యమంత్రి సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే ఏపీఏడీసీ అధికారులతో మంత్రి బీసీ జనార్దనరెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం వాటర్ ఎయిర్ పోర్టుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఆసక్తి కలిగిన సంస్థల నుంచి ఏపీఏడీసీ.. రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎ్ఫపీ)ను ఆహ్వానించింది. వాటిని ఏప్రిల్ 3వ తేదీలోగా సమర్పింపాలని కోరింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన సంస్థలు మాత్రమే.. ఆర్ఎ్ఫపీలు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ నివేదికలను పరిశీలించాక వాటర్ ఎయిర్ పోర్టుల స్థాపనపై తుది నిర్ణయం తీసుకుంటామని ఏపీఏడీసీ చెబుతోంది.
Also Read
Education
More