ఏపీలో మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచే పనిచేసే విధానం) ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం తమ ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే సచివాలయ ఉద్యోగులతో క్షేత్రస్ధాయిలో సర్వే చేయిస్తున్నారు.
రాష్ట్రంలో మొత్తం 2.68 కోట్ల మందిని సర్వే చేయాలని లక్షంగా పెట్టుకున్న ప్రభుత్వం.. ఇందులో ఇప్పటికే 82 లక్షల మంది అభిప్రాయాలు తీసుకుంది. వీటి ఆధారంగా ఇవాళ సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోంను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. వర్క్ ఫ్రం హోంతో పాటు నైబర్ హుడ్ వర్కింగ్, కో వర్కింగ్ విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. ఇంటి నుంచే పని విధానంలో వసతులు, అవకాశాలు కల్పించడం, శిక్షణ అందించడం ద్వారా పెద్ద ఎత్తున అవకాశలు సృష్టించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉందన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వర్క్ ఫ్రం హోంపై సర్వే నిర్వహిస్తున్నారని, 2.68 కోట్ల మందిని సర్వే చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు.
ఇందులో ఇప్పటి వరకు 82.06 లక్షల మందిని సర్వే చేశారన్నారు. వీరిలో 1.72 లక్షల మంది వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తున్నట్లు వివరించారు. వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నా..తమకు తగిన అవకాశాలు లేవని…అటువంటి ఉపాధి కల్పిస్తే తాము కూడా వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తామని 20.43 లక్షల మంది చెప్పినట్లు అధికారులు సీఎంకు తెలిపారు.
సర్వే చేసిన వారిలో ఇంటర్ కంటే తక్కువ చదివిన వారు 9.05 లక్షల మంది ఉండగా, డిప్లొమా, ఆపై చదువులు చదివిన వారు 10.73 లక్షల మంది ఉన్నారన్నారు. ఆయా గ్రామాల్లో వర్క్ ఫ్రం హోం సెంటర్లు, పని స్టేషన్ సెంటర్ల ఏర్పాటుకు ఉన్న భవనాలపైనా సర్వే నిర్వహిస్తున్నారు. విద్యార్హతలు ఉండి, పని చేసే సామర్థం ఉన్నవారికి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఇంటి వద్ద నుంచి పనిచేసే అవకాశాలు కల్పించేందుకు ఆయా సంస్థలతో మాట్లాడాలని సీఎం అధికారులకు సూచించారు.

































