రాజకీయాల్లో ఎవరికైనా సరే క్యారెక్టర్ ఉండాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్ అన్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన తాడేపల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
తమ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బయటకు వెళ్లారన్నారు. తమ పార్టీ ప్రజా ప్రతినిధులు లేదా నాయకులను ఎవరో ఒకరిని ఇరికించి కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి కేసులు నిలబడతాయా అని ఆయన ప్రశ్నించారు. ప్రలోభాలు, భయంతో క్యారెక్టర్ తగ్గించుకోవద్దని ఆయన కోరారు. విజయసాయి రెడ్డితో పాటు ఎవరికైనా ఇదే వర్తిస్తోందని ఆయన అన్నారు.
ఈ ఏడాది జనవరి 24న విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. మరునాడు అంటే జనవరి 25న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్ ఆమోదించారు. తనకు రాజకీయాల్లో అవకాశం కల్పించిన జగన్ కు, ఆయన సతీమణి భారతికి విజయసాయిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో వ్యవసాయం చేస్తానని ఎంపీ పదవికి రాజీనామా సమర్పించిన తర్వాత మీడియాకు చెప్పారు.
విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సమయంలో జగన్ విదేశాల్లో ఉన్నారు. రాజీనామా చేయవద్దని విజయసాయిని జగన్ వారించారు. కానీ, ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మీడియాకు విజయసాయిరెడ్డి చెప్పారు.