CNG Bike: ప్రపంచంలో తొలి CNG బైక్‌ వచ్చేసింది.. కిలో మీటర్‌కు రూపాయి కంటే తక్కువ

www.mannamweb.com


CNG Bike: ప్రపంచంలో తొలి CNG బైక్‌ వచ్చేసింది.. కిలో మీటర్‌కు రూపాయి కంటే తక్కువ

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి ఉపశమనం కల్పిస్తూ ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ వచ్చేస్తోంది. ఎన్నో రోజుల ఎదురు చూపులకు చెక్‌ పెడుతూ బజాజ్‌ ఫ్రీడమ్ 125 పేరుతో కొత్త బైక్‌ను శుక్రవారం లాంచ్‌ చేశారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ తొలి సీఎన్‌జీ బైక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇప్పటి వరకు సీఎన్‌జీ కార్లు, ఆటోలు మాత్రమే అందులోబాటులో ఉండగా తొలిసారి బైక్‌ వచ్చింది.

ఈ బైక్‌ను మొత్తం మూడు వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే బజాజ్ ఫ్రీడమ్ 125 CNG బైక్ డ్రమ్ రూ. 95,000కాగా డ్రమ్‌ ఎల్‌ఈడీ ధర రూ. 1.05 లక్షలు, డ్రమ్‌ ఎల్ఈడీ డిస్క్‌ ధర రూ. 110 లక్షల ఎక్స్ షోరూమ్‌ ప్రైజ్‌గా నిర్ణయించారు. బుకింగ్స్ ప్రారంభంకాగా ప్రస్తుతానికి మాత్రం మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఇక ఈ బైక్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు.

సీటు కింద సీఎన్‌జీ ట్యాంకును అమర్చారు. ఈ బైక్‌ సీఎన్‌జీతో పాటు పెట్రోల్‌కు కూడా సపోర్ట్‌ చేస్తుంది. ఒక చిన్న బటన్‌ సహాయంతో ఫ్యూయల్‌ ఏది కావాలనేదాన్ని సెలక్ట్ చేసుకోవచ్చు. హ్యాండిల్‌ వద్ద ఈ స్విచ్‌ను అందించారు. దీంతో సులభంగా సీఎన్‌జీ నుంచి పెట్రోల్‌కు, పెట్రోల్‌ నుంచి సీఎన్‌జీకి మారొచ్చు. ఇక ఈ బైక్‌ ఇంజన్‌ గరిష్టంగా 9.5bhp పవర్, 9.7nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఇక మైలేజ్‌ విషయానికొస్తే ఈ బైక్‌ సీఎన్‌జీతో కిలోకు 102 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుంది. ప్రస్తుతం కిలో సీఎన్‌జీ ధర రూ. 92 ఉంది. దీంతో ఈ బైక్‌తో సుమారు రూపాయికి ఒక లీటర్‌ ప్రయాణించవచ్చన్నమాట. ఇక పెట్రోల్ విషయానికొస్తే 64 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఫ్రీడమ్‌ 125లో DRLతో కూడిన రౌండ్ హెడ్‌ల్యాంప్‌ను అందించారు.

11 రకాల సేఫ్టీ టెస్టింగ్‌లను నిర్వహించిన తర్వాత ఈ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. అన్ని టెస్ట్‌ల్లోనూ సీఎన్‌జీ కిట్‌ చెక్కు చెదరకపోవడం విశేషం. ఈజిప్టు, టాంజానియా, పెరూ, ఇండోనేషియా, బంగ్లాదేశ్ వంటి దేశాలకు కూడా ఈ బైక్‌ను ఎగుమతి చేయనున్నారు. కొత్త సీఎన్‌జీ బైక్‌ ఒక గేమ్‌ ఛేంజర్‌ బైక్‌గా బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ అభివర్ణించారు. ఇలాంటి ఉత్పత్తులను ప్రోత్సాహించాలని ఆయన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు.