భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన

www.mannamweb.com


US travel advisory: భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన

వాషింగ్టన్‌ డీసీ: భారత్‌లోని తమ దేశ పౌరులకు అగ్రరాజ్యం అమెరికా కీలక సూచనలు చేసింది. మణిపుర్‌, జమ్మూ కశ్మీర్, భారత్-పాకిస్థాన్ సరిహద్దులతో పాటు మావోయిస్టులు క్రియాశీలకంగా ఉన్న దేశ మధ్య, తూర్పు ప్రాంతాలకు వెళ్లొద్దని కోరింది. ఈశాన్య రాష్ట్రాలకు ప్రయాణంపై పునరాలోచించాలంటూ రివైజ్డ్‌ ట్రావెల్‌ అడ్వైజరీని ఆ దేశ విదేశాంగ శాఖ విడుదల చేసింది. దేశంలో పెరుగుతోన్న నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులోని 10 కి.మీల పరిధిలో కాల్పులు జరిగే అవకాశం ఉన్నందున అటువైపు వెళ్లొద్దని సూచించింది. అలాగే, తూర్పు లద్ధాఖ్‌ ప్రాంతం, లేహ్‌ మినహా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లోనూ పర్యటించొద్దని కోరింది. అక్కడ ఉగ్రవాదం, అశాంతి నెలకొందని తెలిపింది.

ఉగ్రవాదం, హింసాత్మక ఘటనల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటనపై పునరాలోచించాలని సూచించింది. భారత్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పలు పర్యాటక ప్రాంతాలు, ఇతర చోట్ల అత్యాచారాలు, లైంగిక వేధింపులు వంటి హింసాత్మక నేరాలు జరిగాయని తెలిపింది. ఉగ్రవాదులు పర్యాటక ప్రదేశాలు, రవాణా కేంద్రాలు, మార్కెట్లు/షాపింగ్ మాల్స్, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటారని తెలిపింది. భారత్‌-పాక్‌ మధ్య నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి హింసాత్మక ఘటనలు సాధారణంగా జరుగుతుంటాయని.. ఇది కశ్మీర్‌లోయలోని పర్యాటక ప్రదేశాలైన శ్రీనగర్‌, గుల్‌మార్గ్‌, పహల్గామ్‌లలో చోటుచేసుకుంటాయని తెలిపింది. అందువల్ల ఈ పర్యాటక ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి కొన్ని ప్రాంతాలను సందర్శించేందుకు భారత ప్రభుత్వం కూడా విదేశీ పర్యటకులను అనుమతించదని పేర్కొంది. సరిహద్దు వెంబడి ఇరు దేశాల సైనిక బలగాలు మోహరించి ఉంటాయని తెలిపింది.

తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ నుంచి బెంగాల్‌ మీదుగా విస్తరించి ఉన్న ప్రాంతంలో మావోయిస్టు గ్రూపులు చురుగ్గా ఉంటాయని తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌తో పాటు తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, యూపీ, బిహార్‌, బెంగాల్‌, ఒడిశాలలో ప్రభుత్వ అధికారులపై దాడులు జరుగుతున్నాయని, ఒడిశాలోని నైరుతీ ప్రాంతంలోనూ ఈ ప్రభావం ఉందన్నారు. మావోయిస్టులు స్థానిక పోలీసులు, పారామిలటరీ బలగాలు, ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తున్నారని తెలిపింది. ఈ ముప్పు తీవ్రత కారణంగా అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు బిహార్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గడ్‌, బెంగాల్‌, మేఘాలయ, ఒడిశా రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఉద్యోగులు ఆయా రాష్ట్రాల రాజధానులకు వెళ్తే మాత్రం అనుమతి అవసరం లేదని.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ తూర్పు ప్రాంతానికి వెళ్లడానికి మాత్రం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించింది.

ఈశాన్య ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పలు జాతులకు చెందిన గ్రూపులు పాల్పడుతున్నాయని తెలిపింది. ఈ ఘటనల్లో బస్సులు, రైళ్లు, రైలు మార్గాలు, మార్కెట్లపై బాంబు దాడులు జరుగుతున్నాయని.. అస్సాం, నాగాలాండ్‌ ,అరుణాచల్‌ప్రదేశ్‌, మిజోరం, సిక్కిం, త్రిపురలో హింసాత్మక ఘటనలు జరిగాయని అడ్వైజరీలో పేర్కొంది.