వాగులో కొట్టుకుపోయిన ఉపాధ్యాయులు

www.mannamweb.com


కొండవాగు పొంగి ప్రవహిస్తోంది.. ఇటువైపు రావద్దని చెబుతున్నా.. తెలుగు అర్థం కాకపోవడంతో ఆ ఉపాధ్యాయులు ముందుకెళ్లారు. అంతలోనే నీటిప్రవాహం పెరగడంతో వాగులో కొట్టుకుపోయారు. ఓ ఉపాధ్యాయిని మృతి చెందగా, మరొకరి ఆచూకీ గల్లంతైంది. ఈ విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. పాచిపెంట మండలంలోని కొటికిపెంటలో ఏకలవ్య పాఠశాల ఏర్పాటు చేశారు. ఇక్కడ వసతి సరిపోక సరాయివలస గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. 45 రోజుల కిత్రం హరియాణా రాష్ట్రానికి చెందిన ఆర్తి (23), మహేశ్‌ ఇక్కడికి ఉపాధ్యాయులుగా వచ్చారు. వీరు గురివినాయుడుపేటలో ఉంటూ పాఠశాలకు వెళ్లి వస్తుంటారు. రోజూ మాదిరిగానే విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలోని రాయిమాను వాగు పొంగి ప్రవహిస్తుండటంతో నీరు కాజ్‌వేపైకి చేరింది. స్థానికులు వీరిని గమనించి, వెనక్కి వెళ్లిపోవాలని అరిచారు. అయితే భాష అర్థంకాక ముందుకు రావడంతో వారిద్దరూ కొట్టుకుపోయారు. కొంతసేపటికి ఆర్తి మృతదేహం లభ్యమైంది. మహేశ్‌ ఓ చెట్టుకొమ్మను పట్టుకొని, ఒడ్డుకు చేరే ప్రయత్నం చేయగా.. కొమ్మ విరిగిపోవడంతో నదిలో పడి గల్లంతయ్యాడు.

గాలింపు చర్యలు: ఈ సమాచారం అందుకున్న గిరిజనశాఖ మంత్రి సంధ్యారాణి వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని కలెక్టర్, పోలీసు అధికారులను ఆదేశించారు. అధికారులు గ్రామస్థుల సాయంతో వాగు పొడవునా కిలోమీటరు మేర గాలించి ఆర్తి మృతదేహం, ఇసుకలో కూరుకుపోయిన ద్విచక్రవాహనాన్ని గుర్తించారు. చీకటిపడటంతో మహేశ్‌ ఏమయ్యారో తెలియకుండా పోయింది. కాజ్‌వే శిథిలమైందని, బాగు చేయాలని గత ఐదేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోలేదని, దీంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని స్థానిక గ్రామాల ప్రజలు వాపోతున్నారు.