ఇక రుణాలు మరింత సులభం.. యూపీఐ తరహాలో యూఎల్‌ఐ.. ఆర్బీఐ నుంచి మరో కొత్త ప్లాట్‌ఫామ్‌!

www.mannamweb.com


దేశంలో యూపీఐ సేవలు ప్రజలు ఎంతగా ఆదరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇదే తరహాలో మరో ప్లాట్‌ఫామ్‌ అందుబాటులోకి రానుంది. డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గత సంవత్సరం కొత్త పథకం పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.

ఈ పథకం పేరు ఫ్రిక్షన్‌లెస్ క్రెడిట్ ప్లాట్‌ఫామ్, రుణం తీసుకునే ప్రక్రియను సులభతరం చేయడం దీని లక్ష్యం. ఇప్పుడు ఈ ప్లాట్‌ఫారమ్ పేరు “యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (ULI)” గా మార్చింది. రుణాలు తీసుకోవడాన్ని మరింత సులభతరం చేయడం కోసం యూనిఫైడ్‌ లెండింగ్‌ ఇంటర్‌ఫేస్‌ను జాతీయ స్థాయిలో త్వరలో అందుబాటులోకి రానున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అన్నారు. బెంగళూరులో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై జరిగిన గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో గవర్నర్‌ ఈ విషయాన్ని ప్రకటించారు.

యుఎల్‌ఐ రుణ మంజూరు ప్రక్రియను సులభతరం చేస్తుందని, దీంతో బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) రుణాలు ఇవ్వడం సులభతరం కానున్నట్లు చెప్పారు. ఎందుకంటే రుణం మంజూరు చేసే సంస్థలు ఒకే చోట నుంచి భూమి రికార్డుల వంటి ముఖ్యమైన డిజిటల్ సమాచారాన్ని పొందుతాయి. ఇది లోన్ ప్రాసెసింగ్‌లో ఉండే సమయం, పత్రాల సేకరణ సమయాన్ని తగ్గిస్తుంది. దేశంలోని చిన్న గ్రామాలు, పట్టణాలు, చిన్న-మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) యూఎల్‌ఐ ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు. ULI ప్లగ్, ప్లే మోడల్ ఆధారంగా రూపొందించారు. తద్వారా ఏదైనా సంస్థ దానిని సులభంగా స్వీకరించవచ్చు. పైలట్ ప్రాజెక్ట్‌తో ULI త్వరలో దేశవ్యాప్తంగా అమలు కానుంది.

యూపీఐ చెల్లింపుల మార్గాన్ని మార్చినట్లే.. యూఎల్‌ఐ కూడా లోన్ పంపిణీ ప్రక్రియలో గణనీయమైన మార్పును తీసుకురానుందని ఆర్బీఐ గవర్నర్‌ అభిప్రాయపడ్డారు. ఇది చిన్న పట్టణాలు, గ్రామాల ప్రజలకు పెద్ద ప్రయోజనం చేకూరనుందన్నారు. ఆర్థిక రంగాన్ని పటిష్టంగా, చైతన్యవంతంగా, కస్టమర్ కేంద్రంగా మార్చే విధానాలు, వ్యవస్థలు, ప్లాట్‌ఫారమ్‌లను రూపొందించడంలో సెంట్రల్ బ్యాంక్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI), అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు ప్రపంచంలోని దాదాపు అన్ని ఆర్థిక వ్యవస్థల భవిష్యత్తు ప్రయాణాన్ని రూపొందిస్తాయని చెప్పారు.