చరిత్ర సృష్టించిన జైస్వాల్.. 51 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ఓపెనర్

www.mannamweb.com


టీమిండియాలో రికార్డులు అనగానే టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీనో లేదా కెప్టెన్ రోహిత్ శర్మనే అందరికీ గుర్తుకొస్తారు. ఎందుకంటే ఇప్పటి టీమ్​లో బ్యాటింగ్​లో మోస్ట్ రికార్డ్స్ వీళ్ల పేరు మీదే ఉన్నాయి. వరల్డ్ క్రికెట్​లో ఎన్నో అన్​బ్రేకబుల్ రికార్డ్స్​ను ఈ ఇద్దరూ బ్రేక్ చేశారు. అయితే వీళ్ల దారిలోనే వెళ్తున్నాడో యంగ్​స్టర్. టీమిండియాలో ఛాన్స్ దొరికిన ప్రతిసారి అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్నాడు. ఎన్నో పాత రికార్డులకు పాతర పెడుతున్నాడు. తాజాగా మరో పాత రికార్డు బూజు దులిపాడు. అతడే యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్. బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్ట్​లో అతడు చరిత్ర సృష్టించాడు. 51 ఏళ్ల నుంచి చెక్కు చెదరకుండా ఉన్న ఓ రికార్డును అతడు బద్దలుకొట్టాడు. ఏంటా రికార్డు? అనేది ఇప్పుడు మనం చూద్దాం..

డెబ్యూ మ్యాచ్​లోనే సెంచరీ బాదిన యశస్వి జైస్వాల్.. 10 టెస్టుల్లోనే వెయ్యికి పైగా రన్స్ చేశాడు. తద్వారా బ్యాటింగ్ గ్రేట్ సునీల్ గవాస్కర్ పేరు మీద ఉన్న ఆల్​టైమ్ రికార్డ్​ను అతడు బ్రేక్ చేశాడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్​లో జైస్వాల్ ఫెయిల్ అయ్యాడు. 17 బంతుల్లో 10 పరుగులు చేసి పెవిలియన్​కు చేరుకున్నాడు. అయితే విఫలమైనా గానీ ఈ ఇన్నింగ్స్​తో ఓ అరుదైన ఘతన సాధించాడు. కెరీర్​లో మొదటి పది టెస్టు మ్యాచుల్లో అత్యధిక రన్స్ చేసిన టీమిండియా క్రికెటర్​గా రికార్డు క్రియేట్ చేశాడు. సునీల్ గవాస్కర్ (978 పరుగులు) పేరిట ఉన్న రికార్డును అతడు బ్రేక్ చేశాడు. 51 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును అతడు బద్దలుకొట్టాడు. అలాగే ఓవరాల్​ టెస్ట్ క్రికెట్​లో తొలి పది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్ల క్లబ్​లో చోటు సంపాదించాడు. ఈ లిస్ట్​లో ఆస్ట్రేలియా లెజెండ్ సర్ డాన్ బ్రాడ్​మన్ (1446 పరుగులు) టాప్​లో ఉన్నాడు.

బ్రాడ్​మన్ తర్వాతి స్థానాల్లో వరుసగా ఎవర్టన్ వీక్స్ (1125 పరుగులు), జార్జ్ హెడ్లీ (1102 పరుగులు) ఉన్నారు. వాళ్ల తర్వాత 1094 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు జైస్వాల్. ఇక, బంగ్లాదేశ్​తో తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్​లో హాఫ్ సెంచరీతో మెరిసిన జైస్వాల్.. సెకండ్ ఇన్నింగ్స్​లో 10 పరుగులు చేసి నహీద్ రాణా బౌలింగ్​లో ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (5) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్​కు చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ (17) కూడా రాణించలేదు. శుబ్​మన్ గిల్ (33 నాటౌట్), రిషబ్ పంత్ (12 నాటౌట్) మరో వికెట్ పడకుండా రెండో రోజును ముగించారు. భారత్ ప్రస్తుతం 308 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో 100 నుంచి 150 పరుగులు జోడిస్తే టీమిండియాను గెలవకుండా ఆపడం ఎవరి వల్లా కాదు. భారత్ జోరు చూస్తుంటే మూడు నుంచి మూడున్నర రోజుల్లోనే బంగ్లా కథ ముగించేలా ఉంది.