సింగరేణి కార్మికులకు దసరా కానుక.. ఒక్కొక్కరికి 1.90 లక్షల బోనస్

www.mannamweb.com


దసరా, దీపావళి పండుగలు వస్తున్నాయంటే చాలు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు బోనస్ ల కోసం చూస్తుంటారు. ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా తమ ఉద్యోగులకు బోనస్ లు అందిస్తుంటాయి. కంపెనీల ఉన్నతిలో భాగమైన ఉద్యోగస్తులకు లాభాలను పంచిపెడుతుంటాయి. కొన్ని కంపెనీలు కొంత మొత్తాన్ని బోనస్ గా ఇస్తుంటాయి. మరికొన్ని కంపెనీలు కార్లు, బైక్ లు ఇతర విలువైన వస్తువులను బోనస్ గా ఇస్తుంటాయి. ఇక మరికొన్ని రోజుల్లో దసరా పండుగ రానున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు తీపికబురును అందించింది. కార్మికులకు దసరా కానుకను ప్రకటించింది. ఏకంగా ఒక్కొక్కరికి రూ. లక్షా 90 వేల బోనస్ ను అందిస్తున్నట్లు ప్రకటించింది.

సింగరేణి కార్మికులకు ముందుగానే దసరా పండగ వచ్చేసింది. రేవంత్ సర్కార్ కార్మికులకు భారీగా బోనస్ ను ప్రకటించింది. ఏకంగా రూ. 796 కోట్లను బోనస్ గా అందించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఒక్కో సింగరేణి కార్మికుడికి సగటున రూ.1.90 లక్షల బోనస్​ అందనుంది. గతేడాది కంటే రూ.20 వేలు అదనంగా సింగరేణి కార్మికులకు బోనస్​గా అందనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి కార్మికుల కుటుంబాల్లో సంతోషం వెల్లువిరిసింది. కార్మికుల ఇళ్లలో ముందుగానే దసరా సంబురాలు మొదలయ్యాయి.

సింగరేణి కార్మికులతో పాటు ఒప్పంద ఉద్యోగులకు కూడా బోనస్​ను ప్రభుత్వం ప్రకటించింది. సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఒప్పంద ఉద్యోగులకూ బోనస్‌ అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఒప్పంద కార్మికులకు ఒక్కొక్కరికీ రూ.5 వేలు బోనస్​ అందించనున్నది. 2023-24 ఏడాదిలో సింగరేణి లాభం రూ.4,701 కోట్లు కాగా, ఆ లాభాల్లో 33 శాతాన్ని ప్రభుత్వం బోనస్​గా ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది కార్మికులకు లాభం చేకూరనున్నది.