జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలింపు

www.mannamweb.com


గత కొన్ని రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న అంశం ఏదైనా ఉందంటే అది జానీ మాస్టర్ కేసుకు సంబంధించినదే. టాప్ కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేకతను ఏర్పర్చుకున్న జానీ లైంగిక ఆరోపణలతో చిక్కుల్లో పడ్డారు. జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేసిన ఓ మహిళ జానీపై తనను లైంగికంగా వేధించాడని, పలుమార్లు అత్యాచారం చేశాడని నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌గా జీరో ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి నార్సింగికి బ‌దిలి చేశారు. అత‌డిపై అత్యాచారం, పోక్సో యాక్ట్ కింద కేసు న‌మోదు చేశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా కలకలం రేగింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు జానీ కోసం సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. పలు ప్రాంతాల్లో వెతికిన పోలీసులు అతడిని గోవాలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించిన పోలీసులు రహస్య ప్రాంతంలో విచారణ జరిపినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత జానీ మాస్టర్ ను ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. విచారణ చేపట్టిన కోర్టు జానీ మాస్టర్ కు 14 రోజుల జ్యుడిషియ‌ల్ రిమాండ్ విధించింది. అక్టోబర్ 03 వరకు జానీకి రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు జానీని చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా జానీకి రిమాండ్ విధించడంపై అతని భార్య సుమలత స్పందించింది. కోర్టులో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

అంతేకాదు జానీపై వచ్చిన ఆరోపణలపై స్ట్రాంగ్ గా స్పందించింది జానీ భార్య సుమలత. అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ పై మండిపడింది. 16 ఏళ్లప్పుడు రేప్ జరిగిందనడానికి ప్రూఫ్స్ ఏంటి? మైనర్ గా ఉన్నప్పుడు అత్యాచారం జరిగితే ఇంతకాలం మౌనంగా ఎందుకున్నట్టు అని ప్రశ్నించింది. అంతకు ముందు చాలా షోలు చేసింది కదా వాళ్లతో ఎఫైర్స్ లేవని గ్యారంటీ ఏంటి? ఆ అమ్మాయికి మిగతా కొరియోగ్రాఫర్స్ కు ఎఫైర్స్ ఉన్నాయని సుమలత స్పష్టం చేసింది.

లైంగికంగా వేధించాడని చెబుతున్నది.. మరి జానీ మాస్టర్ దగ్గర పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్న అని ఆ అమ్మాయి స్మైలీ ఫేస్ తో ఎలా చెప్పింది అని సుమలత ప్రశ్నించింది. సెక్సువల్ హరాష్ మెంట్ చేశాడని నిరూపిస్తే జానీని వదిలేసి వెళ్తా అంటూ సవాల్ విసిరింది. నేషనల్ అవార్డు వచ్చిన తరువాత జానీ మాస్టర్ ను కావాలని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. జానీని ఎదగకుండా చేసేందుకే ఇలా కుట్రలు పన్నుతున్నారని చెప్పుకొచ్చారు.