జానీ మాస్టర్ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ.. కోర్టు కీలక ఆదేశాలు

www.mannamweb.com


లైంగిక వేధింపుల కేసులో టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను హైదరాబాద్ నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ అసిస్టెంట్‌ మహిళా కొరియోగ్రాఫర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఆ తర్వాత అతనిని ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరచగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది. కాగా జానీ మాస్టర్ ను 5 రోజుల కస్టడీకి నార్సింగి పోలీసులు కోరారు. పోక్సో కేసుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్‌ దాఖలు చేశారు. సోమవారం (సెప్టెంబర్ 23) ఈ పిటిషన్ విచారణకు రాగా, వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను మంగళవారం (సెప్టెంబర్ 24)కు వాయిదా వేసింది.మరోవైపు ఇదే కేసులో బెయిల్ మంజూరు చేయాలని జానీ మాస్టర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.దీనిని కూడా
బుధవారం (సెప్టెంబర్ 24) కోర్టు వాయిదా వేసింది.

మరోవైపు జానీ మాస్టర్ పై వస్తోన్న లైంగిక ఆరోపణలు టాలీవుడ్ లో సంచలనం రేపుతున్నాయి. ఈ కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా జానీ మాస్టర్‌ వివాదంలో అల్లు అర్జున్ ఉన్నాడన్న వార్తలను ఖండించారు పుష్ప నిర్మాతలు. పుష్ప 2 స్టార్టింగ్ నుంచి అన్ని పాటలకు అడిషనల్ కొరియోగ్రఫర్ గా ఆ లేడీ డాన్సర్‌ను నియమించుకున్నామన్న నిర్మాత.. ఆరు నెలల క్రితం రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్ లో కూడా ఆ డాన్సర్ పేరు ఉందని చెప్పుకొచ్చారు.

కాగా ప్రస్తుతం జానీ మాస్టర్‌ చర్లపల్లి జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో జానీని కస్టడీకి ఇస్తే వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. లైంగిక వేధింపులు, పోక్సో కేసుతో జానీ మాస్టర్‌ పరారీలో ఉండగా.. ఈ నెల 19న సైబరాబాద్‌ పోలీసుల బృందం గోవాలో అరెస్టు చేసింది. ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలించి.. విచారణ అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ని విధించింది.