మ‌ళ్లీ ఆగిన బ‌దిలీల ప్రక్రియ‌, అక్టోబర్ 2 వరకు ఆ ఉద్యోగులను రిలీవ్ చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలు

www.mannamweb.com


జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోల బదిలీల ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. పలు ప్రభుత్వ కార్యక్రమాల దృష్ట్యా అక్టోబర్ 2 వరకు బదిలీ అయిన ఉద్యోగులను రిలీవ్ చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు బదిలీలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వ‌చ్చిన త‌రువాత చేప‌ట్టిన బ‌దిలీల ప్రక్రియ ఎప్పటికప్పుడే వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. తాజాగా మ‌రోసారి బదిలీల ప్రక్రియ వాయిదా పడింది. అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు బ‌దిలీ అయిన జిల్లా అధికారులు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, మండ‌ల ప‌రిష‌త్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓ)లను రిలీవ్ చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

జిల్లా స్థాయి అధికారులు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, మండ‌ల ప‌రిష‌త్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓ), స‌చివాల‌య ఉద్యోగులు ఇలా వివిధ విభాగాల ఉద్యోగుల బ‌దిలీల ప్రక్రియను ప్రభుత్వం చేప‌ట్టింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌, డీఎస్‌పీ, ఎస్ఐ, సీఐ, దేవదాయ శాఖ ఈవోల బ‌దిలీ ప్రక్రియ కూడా జ‌రిగింది. అయితే ఐఏఎస్‌, ఐపీఎస్‌, డీఎస్‌పీ, ఎస్ఐ, సీఐ, దేవదాయ శాఖ ఈవోల బ‌దిలీల్లో ఎటువంటి జాప్యం జ‌ర‌గ‌లేదు. కానీ జిల్లా అధికారులు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, మండ‌ల ప‌రిష‌త్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓ), స‌చివాల‌య ఉద్యోగుల బదిలీలు ఎప్పటిక‌ప్పుడు వాయిదా ప‌డుతూనే ఉంది.

అయితే బ‌దిలీ ప్రక్రియ జ‌రిగిన‌ప్పుటికీ, వివిధ ప్రభుత్వ కార్యక్రమాల వ‌ల్ల బ‌దిలీ అయిన వారిని రిలీవ్ చేయొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవ‌లి “ఇది మంచి ప్ర‌భుత్వం” కార్యక్రమంలో భాగంగా సెప్టెంబ‌ర్ 26 వ‌ర‌కు బ‌దిలీ అయిన స‌చివాల‌య ఉద్యోగులను రిలీవ్ చేయొద్దని ఉత్తర్వులు వెలువ‌డ్డాయి. తాజాగా “స్వర్ణ ఆంధ్ర@2047, ఇది మంచి ప్రభుత్వం, స్వచ్ఛతాహి సేవా 2024, సాంఘిక సంక్షేమ పింఛన్ల పంపిణీ” వంటి నాలుగు ప్రభుత్వ కార్యక్రమాల దృష్ట్యా బ‌దిలీ అయిన జిల్లా అధికారులు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, మండ‌ల ప‌రిష‌త్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓ) ఉద్యోగులను అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు రిలీవ్ చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి (సీఎస్‌) అన్ని జిల్లాల క‌లెక్టర్లకు ఆదేశించారు.

ఈనెల 23న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి అన్ని జిల్లాల క‌లెక్టర్లకు వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్‌లో స్వర్ణ ఆంధ్ర@2047, ఇది మంచి ప్రభుత్వంతో పాటు గ్రామ స‌భ‌లు, స్వచ్ఛతా హి సేవా 2024, సాంఘిక సంక్షేమ పింఛన్ల పంపిణీ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నందున బదిలీ అయిన జిల్లా అధికారులు, మున్సిప‌ల్ క‌మిషన‌ర్లు, ఎంపీడీవో అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు రిలీవ్ చేయొద్దని క‌లెక్టర్లకు ఆదేశించారు.

మ‌రోవైపు స‌చివాలయ ఉద్యోగుల బ‌దిలీల‌కు సంబంధించిన రిలీవ్ కూడా వ‌చ్చే నెల వ‌ర‌కు వాయిదా పడే అవ‌కాశం ఉంది. ఎందుకంటే అక్టోబ‌ర్ 1న సామాజిక పెన్షన్ల పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో ఈనెల 26 వర‌కు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స‌చివాలయ ఉద్యోగుల రిలీవ్ చేయొద్దని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 26 త‌రువాత స‌చివాల‌య ఉద్యోగుల రిలీవ్ చేయొద్దని ఉత్తర్వులు ఇచ్చే అవ‌కాశం ఉంది.