మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు

www.mannamweb.com


మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

మొత్తం ఢిల్లీ నుంచి 16 ఈడీ బృందాలు హైదరాబాద్ కు చేరుకున్నాయి. ఏకకాలంలో హైదరాబాద్ లోని 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కస్టమ్స్ సుంకం ఎగవేత కేసులో మనీలాండరింగ్ కేసులో ఆయన నివాసంలో ఈడీ దాడులు చేస్తున్నట్లు సమాచారం. అలాగే షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, రాఘవా కన్స్ట్రక్షన్స్ మధ్య సంబంధాలపై ఈడీ ఆరా తీస్తోంది. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నుండి తీసుకున్న ఫేక్ గ్యారెంటీలపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు చేయడం ఇది రెండోసారి. గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖమ్మంలోని పొంగులేటి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. తాజాగా మరోసారి ఆయన నివాసంపై ఈడీ దాడులు చేయడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కొడుకు కొన్న వాచ్తో…

ఇటీవల వాచీల స్మగ్లింగ్ కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు నివాసంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్ష రెడ్డి రూ.1.7 కోట్లు విలువగల వాచీల స్మగ్లింగ్ కేసులో గతంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది ఫిబ్రవరి 5న చెన్నై ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు రెండు అత్యంత ఖరీదైన వాచీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాచీలను మహమ్మద్ ఫహెర్దీన్ ముబీన్ అనే వ్యక్తి హాంకాంగ్ నుంచి సింగపూర్ మీదుగా భారత్లోకి తీసుకొచ్చినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

ఈ వాచీలను పాటెక్ ఫిలిప్ 5740, బ్రెగ్యుట్ 2759గా గుర్తించారు. కాగా.. మన దేశంలో పాటెక్ ఫిలిప్ వాచ్ కు సంబంధించి డీలర్లు లేరు. బ్రెగ్యుట్ కంపెనీకు సంబంధించిన వాచీలు మన మార్కెట్లో స్టాక్ లేవు. దీంతో అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ఆ వాచీలను పరిశీలించగా.. వాటి ధర రూ.1.70 కోట్లపైగా ఉందని గుర్తించి షాక్ అయ్యారు. దీంతో ఆ వాచీలను తీసుకువచ్చిన ముబీన్ను అరెస్టు చేసి విచారణ చేపట్టగా నవీన్ కుమార్ అనే వ్యక్తి కోసం తీసుకువచ్చినట్లు చెప్పాడు.

దీంతో నవీన్ కుమార్ ను విచారణ చేయగా.. అతను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షా రెడ్డి పేరు చెప్పాడు. హర్షారెడ్డి కోసం నవీన్ కుమార్ మధ్యవర్తిగా ఈ వాచీలను తెప్పిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హవాలా మార్గంలో ఇందుకు డబ్బులు చెల్లించినట్లు కస్టమ్స్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో గతంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.