గుడ్‌న్యూస్.! ఏపీకి తొలి వందే మెట్రో.. ఏ రూట్‌లోనంటే

www.mannamweb.com


రైల్వే ప్రయాణీకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఇండియన్ రైల్వేస్ ఎప్పటికప్పుడు కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే వేగం, సౌకర్యవంతమైన రైలు ప్రయాణం కోసం వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది భారత రైల్వే.

ఇప్పటిదాకా వందేభారత్ డే ట్రావెల్ ఎక్స్‌ప్రెస్‌లు మాత్రమే పరుగులు పెడుతున్నాయి. త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈలోపే తక్కువ దూరం ఉండే నగరాల మధ్య వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టాలని భారత రైల్వే ఆలోచించింది. ఈ క్రమంలోనే ఇటీవల గుజరాత్‌లోని భుజ్- అహ్మదాబాద్ మధ్యన దేశంలోనే తొలి వందే మెట్రో రైలును ప్రధాని మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఏపీలోనూ వందే మెట్రో(నమో భారత్) రైలు పరుగులు తీయనుంది. ఈ అంశంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తాజాగా జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ డీఆర్‌ఎం మీటింగ్‌లో క్లారిటీ ఇచ్చారు. రోజూవారి ప్రయాణీకుల దృష్ట్యా శ్రీకాకుళం-విశాఖపట్నం మార్గం మధ్యన వందే మెట్రో రైలు నడపాలని రైల్వే అధికారులను సూచించారు. శ్రీకాకుళం నుంచి విశాఖకు వివిధ పనుల కోసం రోజూవారీ ప్రయాణించేవారి సంఖ్య ఎక్కువని.. వారిని దృష్టిలో పెట్టుకుని శ్రీకాకుళం- విశాఖ నమో భారత్ రైలును నడపాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అధికారులను కోరారు. అటు శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్, తిరుపతి మార్గాల్లో కొత్త రైలు సర్వీసులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు తక్కువ దూరాలున్న నగరాల మధ్య ఈ వందే మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ఈ నమో భారత్ రైళ్లను అందుబాటులోకి తేవాలని ప్రణాళికలు చేస్తోంది భారత రైల్వే. ఈ రైలు గరిష్టంగా గంటకు 130 కిమీ వేగంతో ప్రయాణించనుండగా.. కూర్చునేందుకు 1150 మంది, నిలబడి ప్రయాణించేందుకు 2 వేల మందికి సాధ్యమయ్యేలా దీనిని రూపొందించారు. వీటిల్లో ఆటోమేటిక్ డోర్స్ ఏర్పాటు చేయగా.. లగేజ్ కోసం ర్యాక్‌లు, మొబైల్ ఫోన్ల చార్జింగ్‌కు సాకెట్లు కూడా ఉన్నాయి.