పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రోజుకు 166 పొదుపుతో చేతికి 26 లక్షలు

www.mannamweb.com


ఆపదలు ఎప్పుడు ఎలా సంభవిస్తాయో ఊహించలేము. కాబట్టి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టకుండా ముందుగానే జాగ్రత్త పడితే మేలు. అనవసరపు ఖర్చులు తగ్గించుకుని పొదుపు చేస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడొచ్చు. డబ్బు సంపాదన కోసం పరుగులు తీస్తున్నారు. సంపాందించిన డబ్బును రెట్టింపు చేయడం ఎలా అని ఆలోచించే వారి సంఖ్య పెరుగుతోంది. తక్కువ సమయంలోనే ఎక్కువ రాబడినిచ్చే పథకాలు ఏమున్నాయని ఆరా తీస్తున్నారు. ఇలాంటి వారికోసం పోస్టాఫీస్ అందించే అద్భుతమైన పథకం ఉంది. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్. ఇందులో నెలకు 5000 పొదుపు చేస్తే చాలు చేతికి ఏకంగా 26 లక్షలు అందుకోవచ్చు.

పోస్టాఫీస్ అందించే పీపీఎఫ్ స్కీమ్ లో పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ కాలానికి కళ్లు చెదిరే రిటర్న్స్ ను అందుకోవచ్చు. పీపీఎఫ్ స్కీమ్ లో మీరు పెట్టే పెట్టుబడిని బట్టి రాబడి మారుతూ ఉంటుంది. పీపీఎఫ్ స్కీమ్‌పై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు. ఈ వడ్డీ రేటు మూడు నెలలకు ఒకసారి మారే అవకాశం ఉంది. లేదంటే స్థిరంగా కూడా ఉంటుంది. పీపీఎఫ్ స్కీమ్‌లో గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. సంవత్సరానికి కనీసం రూ. 500 అయినా పెట్టుబడి పెడితే స్కీమ్ అకౌంట్ కొనసాగుతుంది. ఈ పథకం మెచ్యూరిటీ 15 ఏళ్లు. అలాగే ఈ పథకంపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకునే వెసులుబాటు ఉంది.

ఈ పథకంలో మీరు రోజుకు 166 అంటే నెలకు రూ. 5000 డిపాజిట్ చేస్తే.. సంవత్సరానికి 60,000 అవుతుంది. ఇలా 15 సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తే, మీ మొత్తం పెట్టుబడి 9 లక్షల రూపాయలు అవుతుంది. మీరు పెట్టిన పెట్టుబడిపై వడ్డీగా 7 లక్షల 27 వేలు వస్తుంది. పెట్టుబడి, వడ్డీ సొమ్ము కలుపుకుని మీరు 16 లక్షల 27 వేల రూపాయలు పొందుతారు. అయితే మీరు పెట్టుబడి వ్యవధిని మరో 5 సంవత్సరాలు పొడిగిస్తే, 20 సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి 12 లక్షలు అవుతుంది. దీనిపై 14 లక్షల 63 వేల వడ్డీ లభిస్తుంది. అంటే మీరు మెచ్యూరిటీ నాటికి 26 లక్షల 63 వేలు పొందుతారు. అయితే మీరు 5 సంవత్సరాలు ఈ పథకాన్ని పొడిగించాలనుకుంటే, మెచ్యూరిటీకి 1 సంవత్సరం ముందుగానే పోస్టాఫీసుకు తెలియజేయాల్సి ఉంటుంది.