జీఎంఆర్‌ కేర్‌ ఆసుపత్రి వైద్యుల అరుదైన ఘనత.. బాలు పాటలు వినిపిస్తూ వృద్ధురాలికి బ్రెయిన్‌ సర్జరీ!

www.mannamweb.com


చెవులకు ఇంపైన రాగం మనసులోని వ్యకులతను పటాపంచలను చేస్తుంది. చల్లటి గాలేదో చుట్టిముట్టిన భావన కలిగిస్తుంది. తెలియని ఆనందాన్ని, సాంత్వనను మనసుకు అందిస్తుంది.

మనసే కాదు శరీరం కూడా సంగీతానికి రకరకాలుగా స్పందిస్తుందని శాస్త్రవేత్తలు సైతం చెబుతున్నారు. ఇంతటి ప్రముఖ్యత ఉన్న సంగీతం పలు రకాల రోగాల నివరణకు కూడా వైద్యులు వినియోగిస్తున్నారు. గతంలో పలువురు రోగులు ఆపరేషన్‌ సమయంలో మేల్కోని ఉండి మనసుకు సాంత్వన ఇచ్చే సంగీతాన్ని వినడమో, నచ్చిన చూస్తూ ఉండగా సర్జరీలు చేయించుకున్న వారు ఉన్నారు. తాజాగా అలాంటి అరుదైన సంఘటన విజయనగరంలోనూ చోటు చేసుకుంది. పక్షవాతంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలికి మత్తు మందు ఇవ్వకుండానే.. ఆమె మేల్కొని పాటలు వింటుండగా.. ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు. వివరాల్లోకెళ్తే..

విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్‌ కేర్‌ ఆసుపత్రికి పక్షవాతం లక్షణాలతో బాధపడుతున్న 65 ఏళ్ల మహిళను కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. పరీక్షించిన డాక్టర్లు ఆమె మెదడులో రక్తస్రావం జరుగుతున్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెకు శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆపరేషన్‌ చేసేందుకు అంగీకరించారు. అయితే ఇప్పటికే వృద్ధాప్యంలో ఉన్న ఆమెకు హృద్రోగంతోపాటు ఉబ్బసం సమస్యలు ఉన్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు.

దీంతో సర్జరీకి మత్తు మందు (జనరల్‌ అనస్తీషియా) ఇవ్వడం ప్రమాదకరమని భావించిన వైద్యులు.. ఆమెకు మత్తు మందు ఇవ్వకుండానే అక్టోబర్‌ 4వ తేదీన రోగిని మెలకువగానే ఉంచి డాక్టర్లు విజయవంతంగా ఆపరేషన్‌ పూర్తి చేశారు. ఆపరేషన్‌ సమయంలో సదరు మహిళ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు వింటూ సర్జరీ చేయించుకున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మహిళ కోలుకుంటుందని, కొన్ని రోజుల తర్వాత డిశ్చార్జ్‌ చేస్తామని వైద్యులు తెలిపారు.