ఆ గ్రామస్తులకు పర్యావరణంపై అక్కర.. కొన్ని దశాబ్దాలుగా టపాకులు కాల్చని గ్రామం.. ఎందుకంటే

www.mannamweb.com


తమిళనాడు శివగంగ జిల్లాలోని కొల్కుడ్​పట్టి, వెట్టంగుడిపట్టి గ్రామస్థులు దీపావళికి టపాసులు కాల్చరు. ఇంత పెద్ద నిర్ణయాన్ని వారు ఎందుకు తీసుకున్నారు?

దీని వెనుక ఉన్న కథేంటి? అని తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే… కొల్కుడ్‌పట్టి గ్రామ పరిసరాల్లోని వెట్టంగుడి అభయారణ్యానికి కొన్ని దశాబ్దాలుగా వలస పక్షులు వస్తున్నాయి. అక్కడే కొన్ని రకాల పక్షులు పిల్లల్ని కంటున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో స్విట్జర్లాండ్​, రష్యా, ఇండోనేషియా, శ్రీలంక వంటి సుదూర ప్రాంతాల నుంచి వెట్టంగుడి అభయారణ్యానికి దాదాపు 15 వేల పక్షులు వలస వస్తాయి.

ఈ అభయారణ్యానికి సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వివిధ జాతుల పక్షులు వస్తాయి. గ్రే హెరాన్‌లు, డార్టర్‌లు, కామన్ టీల్స్ సహా మరో 5 నుంచి 10 రకాల వలస పక్షులు వస్తాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ అభయారణ్యం 38 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దాదాపు అర్ధశతాబ్దం నుంచి 200 జాతుల వలస పక్షులు వెల్లంగుడి అభయారణ్యానికి వస్తున్నాయని చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా పక్షులను సురక్షితంగా చూసుకుంటున్నారు అక్కడి గ్రామాల ప్రజలు.

దీపావళి సమయంలో టపాసులను పేల్చడం కానీ.. తమ పిల్లలు చేత కాల్పించడం గానీ చేయరు. ఆ వలస పక్షులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా స్వచ్ఛందంగా టపాసులు కాల్చడం విరమించుకున్నారు. అయితే గత ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల పక్షుల రాక తగ్గిందని.. పర్యాటకులు సైతం బాగా తగ్గారనీ గ్రామస్థులు అంటున్నారు. పక్షులను చూసేందుకు వచ్చే పర్యాటకులకు కనీస సౌకర్యాలు లేవనీ అన్నారు. కోతుల బెడద కూడా ఎక్కువైందనీ అవి వచ్చి పక్షుల గూళ్లను పాడు చేస్తున్నాయన్నారు. అది కూడా పక్షులు రాక తగ్గడానికి ఒక కారణంగా చెప్పొచ్చన్నారు. దీనిపై ప్రకృతి ప్రేమికులు, పక్షి ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు.