కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. లెక్కల్లోనే అసలు చిక్కు

www.mannamweb.com


దీపావళి పండుగ సందర్భంగా కేంద్రం ఇటీవల ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ), పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్)ని జూలై 1, 2024 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు (49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 64.89 లక్షల మంది పెన్షనర్లు) లబ్ధి పొందనున్నారు. డీఏ పెంపు వల్ల కేంద్ర ఖజానాకు దీని వల్ల రూ. 9,448 కోట్ల ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. 2024 మార్చిలో కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌ను బేసిక్ పేలో 4 శాతం నుంచి 50 శాతానికి పెంచింది. ప్రభుత్వం డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్)ని కూడా 4 శాతం పెంచింది.

జీతాల పెంపు లెక్క ఇదే

ప్రభుత్వం 3 శాతం డీఏ పెంపును ప్రకటించినందున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత జీతాలు పెరిగే అవకాశం ఉంది? అనే విషయం ఇటీవల ప్రతి ఒక్కరూ వివిధ సైట్స్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఒక ఉద్యోగి జీతం నెలకు రూ. 30,000, మూల వేతనంగా రూ. 18,000 ఉంటే, అతను లేదా ఆమె ప్రస్తుతం రూ. 9,000 డియర్‌నెస్ అలవెన్స్‌గా పొందుతున్నారు. ఇది బేసిక్ పేలో 50 శాతం. అయితే, తాజా 3 శాతం పెంపు తర్వాత ఉద్యోగికి ఇప్పుడు నెలకు రూ.9,540 లభిస్తుంది. ఇది రూ.540 ఎక్కువ. కాబట్టి ఎవరైనా రూ. 18,000 ప్రాథమిక వేతనంతో నెలకు దాదాపు రూ. 30,000 జీతం కలిగి ఉంటే అతని లేదా ఆమె జీతం నెలకు రూ. 540 పెరుగుతుంది.

డీఏ పెంపు నిర్ణయం ఇలా

జూన్ 2022తో ముగిసే కాలానికి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్‌కు సంబంధించిన 12 నెలవారీ సగటు పెరుగుదల శాతం ఆధారంగా డీఏ, డీఆర్ పెంపు నిర్ణయిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 1, జూలై 1 తేదీల్లో అలవెన్సులను సవరిస్తుంది. అయితే ఈ నిర్ణయం సాధారణంగా మార్చి, సెప్టెంబర్‌లో ప్రకటిస్తారు. 2006లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్‌లను లెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్ములాను సవరించిన విషయం తెలిసిందే.