అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మరో మాటను నిలబెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సీజన్ నుంచే కనీస మద్దతు ధరతోపాటు సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం..
ఇచ్చిన హామీ మేరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాలుకు రూ. 500 బోనస్ అదనంగా చెల్లిస్తోంది.
తాజాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల ప్రాంతంలో కొందరు రైతులకు సన్న వడ్లకు రూ. 500 బోనస్ వారి బ్యాంక్ ఖాతాల్లో పడింది. 46 క్వింటాళ్ల 80 కిలోల సన్న వడ్లు అమ్మిన రైతుకు తన ఖాతాలో బోనస్ రూ. 23,400 జమ అయ్యాయి. దీంతో ప్రభుత్వం ఇచ్చే ఈ బోనస్ వల్ల తమకు అదనపు ఆదాయం వస్తోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించడంతో సన్న రకాల ధాన్యం మార్కెట్లోకి పోటెత్తుతోంది. ఈ వర్షాకాలం సీజన్లో 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. గతంలో కంటే భిన్నంగా దొడ్డు వడ్ల సాగు తగ్గి, సన్న వడ్ల సాగు భారీగా పెరిగింది. సన్న వడ్లకు బోనస్ ప్రకటించడంతో గతం కంటే 61 శాతం పంట సాగు పెరగడం గమనార్హం.
గత వానాకాలంలో వరి సాగు విస్తీర్ణంలో సన్నాల వాటా 25.05 లక్షల ఎకరాలు (38 శాతం) కాగా.. ఈసారి అది 40.44 లక్షల ఎకరాలకు (61 శాతం) పెరిగింది. మరోవైపు, గత వానాకాలంలో 40.89 లక్షల ఎకరాల్లో దొడ్డు వడ్లు సాగైతే.. ఈసారి అది 26.33 లక్షల ఎకరాలకు తగ్గింది. సాగు గణనీయంగా పెరగడంతో దిగుబడిలోనూ సన్న వడ్లు రికార్డు సృష్టిస్తోంది.
ఈసారి సన్న వడ్ల దిగుబడి దాదాపు 93.33 లక్షల టన్నులు ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వడ్ల కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7,500 సెంటర్లు ఏర్పాటు చేసింది. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు తమ సన్న వడ్లను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. తాజాగా, బోనస్ కూడా వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
































