అమిత్‌ షా అంబేడ్కర్‌ వ్యాఖ్యలకు వైఎస్‌ జగన్‌ మద్దతు.. వైసీపీ సంచలన ట్వీట్‌

దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ మంటలు కొనసాగుతున్న వేళ వైఎస్సార్‌సీపీ సంచలన ప్రకటన చేసింది.


ఈ అంశంలో అమిత్‌ షాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వెనకేసుకొచ్చినట్లు కనిపిస్తోంది. అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆ తర్వాత ఆయన మంచిగా మాట్లాడారని పేర్కొనడం విస్తుగొలిపింది. ఈ క్రమంలో విజయవాడలో పెట్టిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని గుర్తుచేసింది. ఆ ట్వీట్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

లోక్‌సభలో ‘ఏమిటి అంబేడ్కర్‌ అంబేడ్కర్‌ అని స్మరిస్తారు’ అని కేంద్ర మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఎన్డీయే పక్షాలు మినహా కాంగ్రెస్‌ పార్టీతోసహా అన్ని ప్రతిపక్ష పార్టీలు తప్పుబడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీ మినహా ఏ పార్టీ స్పందించని సమయంలో వైఎస్సార్‌సీపీ ఎంట్రీ ఇచ్చింది. అమిత్‌ షా వ్యాఖ్యలను వెనకేసుకొస్తూ చేసిన ట్వీట్‌ సంచలనం రేపుతోంది.

‘వాళ్లు అంబేద్కర్‌ పేరును వందసార్లు అంటారు.. అన్నిసార్లు దేవుడ్ని పేరు తలుచుకుంటే పుణ్యం వస్తుందన్నట్టుగా’ అమిత్‌ షా మాట్లాడిన మాటలు అపోహలకు దారితీశాయి. కానీ.. ఆ తర్వాత ఆయన అంబేద్కర్‌ గురించి కొనసాగిస్తూ ఆయన అన్న మాటలు.. బీజేపీ సభ్యులు మాట్లాడిన మాటలు, ప్రధాని మోదీగారు మాట్లాడిన మాటలు.. గమనిస్తే అందరూ అంబేద్కర్‌గారిని గౌరవిస్తూ కొనియాడడం మంచి పరిణామం’ అని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. అంటే అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలకు వైస్సార్‌సీపీ మద్దతు ఇస్తున్నట్టు కనిపిస్తోంది.

‘అంబేద్కర్‌ను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కించపరిచినా.. పల్లెత్తు మాట అన్నా అది తప్పే. పేదవాడికి సమాన హక్కులు, గౌరవం ఉండాలనే అంబేద్కర్‌ భావజాలం మాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. ఆ స్ఫూర్తి పరిఢవిల్లేలా విజయవాడ నడిబొడ్డున అతిపెద్ద అంబేడ్కర్‌ విగ్రహాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిలబెట్టి.. అద్భుతమైన స్మృతివనాన్ని నిర్మించింది. అంబేద్కర్‌ మాకే కాదు.. యావత్‌ దేశానికి ఆదర్శంగా చిరకాలం ఉంటారు’ అని వైఎస్సార్‌సీపీ అధికారిక ‘ఎక్స్‌’లో పోస్టు కనిపించింది.

ఈ పోస్టును చూసినవారంతా అమిత్‌ షా వ్యాఖ్యలకు మద్దతు ఇస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు.. లేనప్పుడూ కూడా బీజేపీకి వంత పాడుతున్నారా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోదీ, అమిత్‌ షాకు అన్ని విషయాల్లో మద్దతు పలుకుతారా? అని ప్రశ్నిస్తున్నారు.

“వాళ్లు అంబేద్కర్‌ పేరును వందసార్లు అంటారు.. అన్నిసార్లు దేవుడ్ని పేరు తలుచుకుంటే పుణ్యం వస్తుందన్నట్టుగా” అమిత్‌ షా మాట్లాడిన మాటలు అపోహలకు దారితీశాయి. కాని, ఆ తర్వాత ఆయన అంబేద్కర్‌గారి గురించి కొనసాగిస్తూ ఆయన అన్న మాటలు, బీజేపీ సభ్యులు మాట్లాడిన మాటలు, ప్రధాని మోదీగారు…

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.