7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ త్వరలో పెరగనుంది. ఇప్పటికే 8వ వేతన సంఘంతో ఆనందంతో ఉన్న ఉద్యోగులకు త్వరలో డీఏ పెంపు రూపంలో మరో శుభవార్త అందనుంది.
ఈసారి 3-4 శాతం డీఏ పెరగవచ్చని తెలుస్తోంది.
7వ వేతన సంఘం ప్రకారం ప్రతి ఏటా రెండు సార్లు జనవరి, జూలై నెలల్లో డీఏ, డీఆర్ పెంపు ఉంటుంది. కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా ఇది నిర్ణయమౌతుంది. ప్రస్తుతం జనవరి నెల డీఏ, డీఆర్ ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. ఈ ప్రకటన హోలీ నాటికి అంటే మార్చ్ నెలలో ఉండవచ్చు.మార్చ్ నెలలో ప్రకటించినా జనవరి, ఫిబ్రవరి ఎరియర్లతో కలిపి మార్చ్ నెల జీతంతో అందుకోనున్నారు. గత ఏడాది అంటే 2024లో జనవరి, జూలై రెండు సార్లు కలిపి 7 శాతం డీఏ పెరిగింది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డీఏ, డీఆర్ 53 శాతం అందుతోంది. జనవరి 2025 నుంచి కొత్తది అందుబాటులో రానుంది. జూలై నుంచి డిసెంబర్ వరకూ ఉన్న ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా జనవరి 2025 డీఏ ఎంతనేది ఉంటుంది. జూలై నుంచి నవంబర్ 2024 వరకూ ఏఐసీపీఐ స్కోర్ 144.5 పాయింట్లకు డీఏ స్కోర్ 55.05 శాతానికి చేరుకుంది. డిసెంబర్ గణాంకాలు ఇంకా వెలువడాల్సి ఉంది. అందుకే హోలీ నాటికి డీఏ-డీఆర్ ప్రకటన 3-4 శాతం ఉండవచ్చని అంచనా. అదే జరిగితే డీఏ 53 శాతం నుంచి 56-57 శాతానికి చేరుతుంది. డీఏ-డీఆర్ పెంపుతో 48 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.
18 వేలు కనీస వేతనం అందుకుంటున్న ఉద్యోగులకు డీఏ 3 శాతం పెరిగితే నెలు 540 రూపాయలు జీతం పెరుగుతుంది. అదే 2.50 లక్షలు గరిష్ట వేతనం అందుకునేవారికి 7500 జీతం పెరుగుతుంది. ఇక పెన్షనర్లకు అయితే 270 రూపాయల నుంచి 3,750 రూపాయల వరకు పెరుగుతుంది. అందుకే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డీఏ-డీఆర్ పెంపుకై చూస్తున్నారు.
































