Markapuram : పింఛన్ డబ్బులతో సచివాలయ ఉద్యోగి మిస్సింగ్.. తీరా ఆరా తీస్తే, భలే ట్విస్ట్!

ప్రకాశం జిల్లాలో ఓ వార్డు సచివాలయ ఉద్యోగి సినిమా రేంజ్‌లో కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పింఛన్ డబ్బుల్ని ఎత్తుకెళ్లి దోపిడీ జరిగినట్లు స్టోరీ చెప్పాడు.. కానీ పోలీసులు మనోడి ప్లాన్‌ను కనిపెట్టారు. మార్కాపురంలో వార్డు సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి.. గత నెల 31న పింఛన్ లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన రూ.2.66 లక్షల డబ్బుల్ని తీసుకుని మాయం అయ్యాడు.. వెంటనే అడ్మిన్‌ సెక్రటరీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అతడి కోసం గాలించగా చివరికి ఆచూకీ దొరికింది.. ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది.


అయితే ఆ ఉద్యోగి పింఛన్‌కు సంబంధించి రూ.2.50 లక్షలు ఆన్‌లైన్‌లో యాప్‌ల్లో బెట్టింగ్‌ పెడితే ఫిబ్రవరి 1న పింఛన్ల పంపిణీ సమాయానికి రూ.10 లక్షలు అవుతుందని ఆశపడ్డాడట. అయితే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఈ విషయం బంధువులకు తెలియడంతో.. వారు ఆ డబ్బుల్ని చెల్లించడంతో.. లబ్ధిదారులకు పింఛన్‌ నగదు అందజేశారు. ఆ వెంటనే ఆ ఉద్యోగిని పోలీసులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. డబ్బుల ఆశతోనే ఇలా చేసినట్లు సమాచారం.. యువత ఇలా బెట్టింగ్స్ మాయలో పడొద్దని చెబుతున్నారు పోలీసులు.

మరోవైపు దొనకొండ దగ్గర బాదాపురం సమీపంలో కూడా మరో సచివాలయ ఉద్యోగిని కొందరు దుండగులు అడ్డుకుని సినిమా స్టైల్‌లో డబ్బుల్ని చోరీ చేసిన ఘటన కలకలం రేపింది. దొనకొండ మండలం చందవరంనకు చెందిన వీరంరెడ్డి రంగారెడ్డి పెద్దన్నపాలెం గ్రామ సచివాలయంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. అయితే ఈ ఊరి పంచాయతీ పరిధిలోని 58 మంది పింఛన్‌దారులకు సంబంధించిన రూ.2.68 లక్షల డబ్బుల్ని శుక్రవారం (జనవరి 31న) సాయంత్రం సొంత ఊరు చందవరానికి వెళ్లారు. శనివారం తెల్లవారుజామున రంగారెడ్డి పింఛన్‌ డబ్బుల్ని పంపిణీ చేసేందుకు చందవరం నుంచి తన బైక్‌పై దొనకొండకు బయల్దేరారు.

ఈ క్రమంలో మార్గమధ్యంలో ఇద్దరు వ్యక్తులు మొహం కనపడకుండా కర్చీఫ్‌లు కట్టుకుని రంగారెడ్డిని బైక్‌పై వెంబడించినట్లు చెబుతున్నారు. బాదాపురం సమీపంలో రంగారెడ్డిని అడ్డగించి.. బైక్‌పై నుంచి కిందకు నెట్టేసి డబ్బులు ఉన్న బ్యాగును లాక్కొని బైక్ ‌పై చందవరం వైపు వెళ్లిపోయారని చెప్పారు. వెంటనే రంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. త్రిపురాంతకం పోలీసులు వెంనటే సంఘటనా స్థలానికి చేరుకొని వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ రంగారెడ్డితో మాట్లాడారు.. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఒంగోలు నుంచి డాగ్‌ స్క్వాడ్‌ను పిలిపించి దొంగల కోసం గాలించారు.. కానీ ఆచూకీ దొరకలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. ఈ చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.