పాఠశాల బాలికలే టార్గెట్.. కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి అత్యాచారాలు..? పోలీసుల అదుపులో ప్రధాన నిందితురాలు..?

పాఠశాల బాలికలే టార్గెట్ గా ఓ మఠా అరాచకాలకు పాల్పడుతుంది. బాలికలను కిడ్నాప్ చేసి ఆ తరువాత వారికి చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ ఇచ్చి, మానవ మృగాల చేతుల్లో పెట్టి ఆ చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు.
అయితే, ఆ కిలాడీ లేడీ ముఠా భాగోతం వరంగల్ లో వెలుగు చూసింది. మిల్స్ కాలనీ పోలీసులు ముఠాలోని ప్రధాన నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.


వరంగల్ మిల్స్ కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ బాలిక కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఇంటికి చేరుకున్న బాలికను ఆరా తీయగా తనను ఓ మహిళ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని, ఆ తరువాత తనకేం జరిగిందో తెలియదని, స్పృహలోకి వచ్చాక వదిలేసి వెళ్లారని చెప్పింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ ఇచ్చినట్లుగా తేలినట్లు సమాచారం. ఆ బాలిక చెప్పిన వివరాలు, ఆనవాళ్లు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మిల్స్ కాలనీ పోలీసులు యువతితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని పలు కోణాల్లో కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది.

హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ వరంగల్, మిల్స్ కాలనీ పరిధిలో నివాసముంటోంది. డ్రగ్స్ కు బానిసైన ఆ లేడీ, తనతోపాటు డ్రగ్స్ కు అలవాటు పడిన ఓ అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడింది. పాఠశాల బాలికలే లక్ష్యంగా ఈ కిలాడీ లేడీ వరంగల్ లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహిస్తుంది. పాఠశాలకు వెళ్లివచ్చే సమయాల్లో ఎంపిక చేసుకున్న బాలికలతో మాటలు కలిపి వారికి దగ్గరవుతుంది. ఆ తరువాత బాలికలను కిడ్నాప్ చేస్తోంది.

కిడ్నాప్ చేసిన బాలికలకు మత్తు పదార్థాలు ఇచ్చి అప్పటికే తన గ్యాంగ్ కు టచ్ లో ఉన్న కస్టమర్లకు అప్పగిస్తోంది. బాలికలు పూర్తిగా స్పృహలోకి రాగానే సదరు కిలాడీ లేడీ గ్యాంగ్ వారిని ఎక్కడ నుంచి తీసుకొస్తుందో అక్కడి వదిలేసి వెళ్లిపోతారు. ఈ ముఠా దాదాపు ఏడాదిన్నరగా ఇలాంటి పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కిడ్నాప్ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పక్కజిల్లాలకు కూడా తరలించినట్టు సమాచారం. అయితే, కిలాడీ లేడీ గ్యాంగ్ వ్యవహారంపై ఇవాళ మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.