శివానికి మరో వారం రోజుల్లో పెళ్లి కావాల్సి ఉంది. ఇప్పటికే వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేసి బందుమిత్రులను కూడా ఆహ్వానించారు.
ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి. అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉండగా పెళ్లి పిల్ల తల్లి అందరికీ షాక్ ఇచ్చింది. తన బిడ్డ మెడలో తాళి కట్టాల్సిన అల్లుడితో ఆమె ఇల్లు విడిచి వెళ్లిపోయింది.
ఈ ఊహించని పరిణామానికి ఆ కుటుంబమే కాదు… యావత్ బంధుమిత్రులు, గ్రామం షాక్ అయింది. అన్నింటికి మించిన మరో ట్విస్ట్ ఏంటంటే… పెళ్లి కోసం సిద్ధం చేసుకున్న నగదు, బంగారు ఆభరణాలు కూడా తన తల్లి అనిత తీసుకెళ్లిపోయిందని శివాని మీడియా ఎదుట వాపోయారు.
ఉత్తర్ ప్రదేశ్లోని అలీఘడ్ జిల్లా మద్రక్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి పెళ్లి చేసుకోవాల్సిన వధువు శివాని మాట్లాడుతూ.. ఏప్రిల్ 16న తనకు రాహుల్ అనే యువకుడితో పెళ్లి జరగాల్సి ఉందని అన్నారు. “గత మూన్నాలుగు నెలలుగా రాహుల్, మా అమ్మ ఇద్దరూ గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకునే వారు. కాబోయే అల్లుడితో పెళ్లి గురించి మాట్లాడుతుందిలే అని అనుకున్నాం కానీ ఇలా అవుతుందనుకోలేదు. పెళ్లికి వారం రోజులే మిగిలి ఉందనగా ఇలా జరిగింది” అని శివాని తెలిపారు.
రూ.3.5 లక్షల నగదు, రూ. 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో తన తల్లి అనిత తనకు కాబోయే భర్తతో వెళ్లిపోయిందని శివాని ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం ఇంట్లో రూ. 10 కూడా మిగల్చలేదన్నారు.
తల్లి చేసిన పనికి అవమాన భారంతో మంచం పట్టిన శివాని
బెంగళూరులో చిరు వ్యాపారం చేసుకుంటున్న శివాని తండ్రి జితేంద్ర కుమార్ తన భార్య అనితపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. “ఇప్పుడు అనిత ఏం కోరుకుంటోంది అనేది ఆమె ఇష్టానికే వదిలేస్తున్నాం. ఇంత జరిగాకా ఆమె విషయంలో మేం ఎవ్వరం ఏదీ పట్టించుకునే ఉద్దేశంలో లేము. కానీ తన బిడ్డ పెళ్లి కోసం కష్టపడి సంపాదించిన ఆ నగదు, బంగారం మాత్రం తిరిగి ఇవ్వాలి” అని జితేంద్ర కుమార్ డిమాండ్ చేశారు.
ఈ వెరైటీ కేసును చూసి మంద్రక్ పోలీసులకు జుట్టు పీక్కున్నంత పని అవుతోంది. దేవుడా ఇలాంటివి మున్ముందు ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందా అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
































