ఎస్బీఐ ఇటీవల కస్టమర్ల కోసం కొత్త పథకాలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రెండు పథకాలు తీసుకురాగా.. అందులో ‘హర్ ఘర్ లఖ్పతి ఆర్డీ’ పథకం ఒకటి. మరొకటి ఎస్బీఐ ప్యాట్రన్స్ స్కీమ్. ఇక హర్ ఘర్ లఖ్పతి పథకం ద్వారా మీరు చేసే డిపాజిట్ల ద్వారా లక్షాధికారులు కావొచ్చు. ఇందుకోసం ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది తెలుసుకుందాం.
సామాన్యుల్లో పొదుపును ప్రోత్సహించేందుకు, డిపాజిట్లను పెంచేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సరికొత్త పథకాలను అందుబాటులోకి తెస్తోంది. ఇటీవల ఎస్బీఐ.. ‘హర్ ఘర్ లఖ్పతి రికరింగ్ డిపాజిట్’ (Har Ghar Lakhpati RD) సహా ఎస్బీఐ ప్యాట్రన్స్ అనే పథకాల్ని తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మనం హర్ ఘర్ లఖ్పతి స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఈ పథకం ద్వారా మీరు ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ నిధిని సమకూర్చుకోవచ్చు. ఇక్కడ సాధారణ ఆర్డీల్లా కాకుండా, మీకు ఎంత మొత్తం కావాలో దానిని బట్టి నెలనెలా ఎంత చెల్లించాలో ముందే తెలుసుకోవచ్చు. ఈ పథకంలో రికరింగ్ డిపాజిట్లకు కనీస కాలవ్యవధి 12 నెలలు కాగా, గరిష్టంగా 120 నెలల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. సాధారణంగా ఆర్డీల్లో మనం నెలకు కొంత నిర్ణీత మొత్తం జమ చేస్తూ వెళ్తాం. కానీ ఈ కొత్త స్కీమ్లో మీరు లక్ష రూపాయల లక్ష్యాన్ని చేరుకోవడానికి వడ్డీ రేట్లను బట్టి నెలకు ఎంత చెల్లించాలో ముందే లెక్కిస్తారు.
ప్రస్తుతం ఎస్బీఐ సాధారణ ప్రజలకు 3 నుంచి 4 సంవత్సరాల కాలవ్యవధి గల రికరింగ్ డిపాజిట్లపై గరిష్టంగా 6.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇతర కాలవ్యవధులపై వడ్డీ రేటు 6.50 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్ల విషయానికి వస్తే, ఇదే కాలవ్యవధికి 7.25 శాతం, ఇతర డిపాజిట్లపై 7 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఇప్పుడు సాధారణ ప్రజలు, సీనియర్ సిటిజన్లు లక్ష రూపాయలు పొందడానికి ఏ కాలవ్యవధిలో నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలో చూద్దాం.
సాధారణ ప్రజలకు..
3 సంవత్సరాలు: నెలకు రూ. 2,500 పెట్టుబడితో 6.75 శాతం వడ్డీ రేటుతో మెచ్యూరిటీకి రూ. లక్ష పొందొచ్చు.
4 సంవత్సరాలు: నెలకు రూ. 1,810 పెట్టుబడితో 6.75 శాతం వడ్డీ రేటుతో మెచ్యూరిటీకి రూ. 1,00,000 పొందొచ్చు.
5 సంవత్సరాలు: నెలకు రూ. 1,407 పెట్టుబడితో 6.50 శాతం వడ్డీ రేటుతో మెచ్యూరిటీకి రూ. లక్ష వస్తుంది.
సీనియర్ సిటిజన్లు..
నెలకు రూ. 2,480 పెట్టుబడితో 7.25 శాతం వడ్డీ రేటుతో మెచ్యూరిటీకి అంటే మూడేళ్లకు రూ. లక్ష వస్తుంది.
ఇదే నాలుగేళ్లకు చూస్తే నెలకు రూ. 1791 పెట్టుబడి పెడితే చాలు.. ఇక్కడ 7.25 శాతం వడ్డీ రేటుతో రూ. లక్ష పొందొచ్చు.
ఐదు సంవత్సరాల వ్యవధికి నెలకు రూ .1389 పెట్టుబడితో 7 శాతం వడ్డీ రేటుతో మెచ్యూరిటీకి రూ. లక్ష పొందే అవకాశం ఉంటుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
ఈ లఖ్పతి ఆర్డీ పథకాన్ని భారతీయ నివాసితులు వ్యక్తిగతంగా లేదా జాయింట్గా తెరవవచ్చు.
పదేళ్లు పైబడిన మైనర్ల తరపున వారి సంరక్షకులు ఖాతా తెరవొచ్చు.
గడువుకు ముందే రూ.5 లక్షల లోపు విత్డ్రా చేస్తే 0.50 శాతం, అంతకు మించి విత్డ్రా చేస్తే 1 శాతం పెనాల్టీ ఉంటుంది.
వరుసగా 6 నెలలు ఇన్ స్టాల్మెంట్స్ చెల్లించకపోతే ఖాతా మూసివేయబడుతుంది.
































