ఉచిత గ్యాస్ సబ్సిడీ కింద రెండో సిలిండర్ డబ్బులు ఇంకా బ్యాంకు ఖాతాలో పడలేదా? అయితే మీ ఆధార్ కార్డు బ్యాంకు అకౌంట్తో లింక్ అయిందో లేదో వెంటనే చెక్ చేసుకోవాలి.
ఏపీలోని జిల్లాలకు చెందిన పౌరసరఫరాల శాఖ అధికారులు గ్యాస్ వినియోగదారులకు తాజా సూచనలిచ్చారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ద్వారా గ్యాస్ కనెక్షన్ను సంబంధిత ఏజెన్సీలో అప్డేట్ చేయాలని వారు కోరుతున్నారు.
వేల మందికి సబ్సిడీ జమ కాలేదు:
జిల్లాలో దాదాపు 2.4 లక్షల మంది లబ్దిదారుల ఖాతాల్లో ఇప్పటికీ రెండో విడత సబ్సిడీ డబ్బులు జమ కాలేదని అధికారులు గుర్తించారు. చాలామంది గ్యాస్ బుక్ చేసిన నెల రోజులైనా నగదు అందకపోవడం వల్ల ఆందోళన చెందుతున్నారు. మొదటి సిలిండర్కు సంబంధించి సబ్సిడీ అందినా, రెండవ సిలిండర్ డబ్బులు రాలేదని వినియోగదారులు చెబుతున్నారు.
సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యం:
రాష్ట్ర ప్రభుత్వం దీపం పథకం కింద లబ్ధిదారులకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తోంది. రెండో విడత డబ్బులు అందకపోవడానికి సాంకేతిక సమస్యలే కారణమని అధికారులు చెబుతున్నారు. డబ్బులు త్వరలోనే జమ చేయనున్నామని వెల్లడించారు.
KYC చేయనివారికి డబ్బులు జమకావు:
కొంతమంది వినియోగదారులు తమ గ్యాస్ అకౌంట్కు KYC పూర్తి చేయకపోవడంతో కూడా సబ్సిడీ నిలిచిపోతోంది. దీంతో ఈ నెలాఖరు లోపు ఆధార్, రేషన్ వివరాలు అప్డేట్ చేయాలని స్పష్టమైన సూచనలిచ్చారు. లేకుంటే రేషన్ కార్డు నుంచి పేరు తొలగించే అవకాశముంది. అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ డబ్బులు కూడా అందవు.
అన్ని అప్డేట్లు పూర్తయ్యాక, సుమారు వారం రోజుల్లోగా సబ్సిడీ నిధులు లబ్దిదారుల అకౌంట్లలోకి జమయ్యే అవకాశముందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శేషాచలం రాజు తెలిపారు.
దీపం పథకానికి వీరు అర్హులు కారు:
* 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఇంటి స్థలం ఉంటే
* నెలకు 100 యూనిట్లకంటే ఎక్కువ విద్యుత్ వినియోగం ఉంటే
ఇలాంటి వారు ఉచిత గ్యాస్ సబ్సిడీకి అర్హులు కారు అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
































