రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. వెయిటింగ్ లిస్ట్ పై కీలక నిర్ణయం

భారతీయ రైలు ప్రయాణంలో ఎక్కువ మంది ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో టికెట్ల నిర్ధారణకు సంబంధించిన ఒకటి. ప్రత్యేకించి వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ప్రయాణికులకు రైలు బయలుదేరే వరకు టెన్షన్ ఉంటుంది.


టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? కావదా? అనే ఉత్కంఠతో ప్రయాణం చివరి నిమిషం వరకూ తేలకపోవడమే ఆందోళనగా మారింది. ఈ గందరగోళ పరిస్థితిని తగ్గించేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైలు బయలుదేరే 24 గంటల ముందే తుది చార్ట్ను సిద్ధం చేయాలనే ఆలోచనకు మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తుది జాబితాను విడుదల చేయాలనే..

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల బికనీర్ పర్యటనలో పాల్గొన్న సమయంలో.. ప్రయాణికుల అనుభవాలను స్వయంగా గమనించారు. అప్పుడు స్థానిక రైల్వే అధికారులు చివరి నిమిషం అనిశ్చితిని తగ్గించేందుకు ముందస్తుగా తుది జాబితాను విడుదల చేయాలనే సలహా ఇచ్చారు. ఇప్పటివరకూ తుది చార్ట్ను రైలు బయలుదేరే 2–4 గంటల ముందు మాత్రమే సిద్ధం చేస్తుండటం వల్ల.. వెయిటింగ్లో ఉన్న ప్రయాణికులు తామెప్పుడు ప్రయాణించగలరో.. ఇతర ఏర్పాట్లు చేసుకోవచ్చో తెలియక అసౌకర్యానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 6 నుంచి బికనీర్ డివిజన్లో ప్రయోగాత్మకంగా కొత్త విధానాన్ని ప్రారంభించారు. రైలు బయలుదేరే ముందు రోజే.. అంటే 24 గంటల ముందు తుది చార్ట్ను సిద్ధం చేసి ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతున్నారు.

ప్రయోగం మొదటి నాలుగు రోజులే ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించింది. కన్ఫర్మ్ టికెట్ లేనివారికి ప్రయాణానికి ప్రత్యామ్నాయ మార్గాలు, వేరే రైళ్లు, ఇతర రవాణా సౌకర్యాలపై ముందుగానే ఆలోచించే అవకాశం లభించింది. ఈ ట్రయల్ విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో.. రైల్వే శాఖ ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ఇతర మార్గాల్లో కూడా అమలు చేయాలని యోచిస్తోంది. ఇది అమలులోకి వస్తే.. రైలు ప్రయాణం మరింత సునాయాసంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రయాణికులకు ముందస్తు సమాచారం, మెరుగైన ప్లానింగ్ అవకాశాలు కలుగడం ద్వారా ఈ నిర్ణయం ప్రయాణ అనుభవాన్ని సమూలంగా మార్చే అవకాశముంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.