‘రప్పా రప్పా నరుకుతాం’.. సినిమా డైలాగుల పై పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్

ఏపీ మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటనలో వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే ప్లకార్డులు ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.


అయితే పోలీసులు కేసు నమోదు చేయడం పై స్పందించిన వైఎస్ జగన్ అది సినిమా డైలాగ్ అని సమర్ధించారు. పుష్ప సినిమాలోని ”గంగమ్మ తల్లి జాతరలో యాట తల నరికినట్లు రప్పా రప్పా నరుకుతా” అనే డైలాగ్ అని మీడియాతో వెల్లడించారు. వైఎస్ జగన్(Former CM YS Jagan) వ్యాఖ్యలను కూటమి మంత్రులు తీవ్రంగా ఖండించారు. వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వైఎస్ జగన్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో తాజాగా ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) ఈ ఘటన పై స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకే బాగుంటాయని పవన్ కల్యాణ్ తెలిపారు. వాటిని ఆచరణలో పెడతాము, ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తాము అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని డిప్యూటీ సీఎం పవన్ తేల్చి చెప్పారు.

ఎవరైనా చట్టం, నియమ నిబంధనలు పాటించాల్సిందే. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తుల పై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించదు. కచ్చితంగా అలాంటి వారిపై రౌడీ షీట్లు తెరిచి.. అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అశాంతిని, అభద్రతను కలిగించే వారికి మద్దతుగా అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడుతున్న వారి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వారిని ఓ కంట కనిపెట్టాలి. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసే వారిని కట్టడి చేయకపోగా.. వారిని సమర్థించేలా మాట్లాడేవారి నేరమయ ఆలోచనలను ప్రజలంతా గమనించాలని పవన్ కల్యాణ్ సూచించారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అని మరచిపోవద్దని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.