మెక్సికోకు వేలాది వాహనాలను రవాణా చేస్తున్న ఓ భారీ కార్గో నౌక ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. ‘మార్నింగ్ మిడాస్’ అనే ఈ నౌకలో సుమారు 800 ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు మొత్తం 3,000 కొత్త వాహనాలు ఉన్నట్లు సమాచారం.
అలస్కాలోని అలూషియన్ దీవుల సమీపంలో అంతర్జాతీయ జలాల్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని నౌక నిర్వహణ వ్యవహారాలు చూస్తోన్న జోడియాక్ మారిటైమ్ అనే సంస్థ తెలిపింది.
కాగా ఈ నౌక అలస్కా తీరానికి దాదాపు 300 మైళ్ల దూరంలో ఉండగా ఈ నెల 3న నౌకలో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో నౌకలో ఉన్న 22 మంది సిబ్బంది లైఫ్బోట్ల ద్వారా సురక్షితంగా బయటపడ్డారు. నౌక నుంచి ప్రమాద సంకేతాలు అందడంతో యూఎస్ కోస్ట్ గార్డ్ తక్షణమే స్పందించి మంటలను అర్పేందుకు కృషి చేసింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.
మంటల వల్ల జరిగిన నష్టం, ప్రతికూల వాతావరణం, నౌకలోకి నీరు చేరడం వంటి కారణాలతో తీరానికి 415 మైళ్ల దూరంలో, సుమారు 16,404 అడుగుల లోతున నౌక మునిగిపోయింది. ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతంలో ఇప్పటివరకు ఎలాంటి కాలుష్య ఆనవాళ్లు కనిపించలేదని యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి, ఆఫీసర్ కామెరాన్ స్నెల్ తెలిపారు.

































