సనాతన ధర్మం పేరుతో తమిళనాడులో వరుసగా పర్యటిస్తున్న జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు భారీ షాక్ తగిలింది. బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి.
తమిళనాడులో తీవ్ర రాజకీయ దుమారం రేపిన ఆ ప్రసంగంపై ద్రవిడ పార్టీలు మండిపడుతున్నాయి. తాజాగా పవన్ కల్యాణ్పై తమిళనాడులో కేసు నమోదైంది. అతడిపై కేసు నమోదవడంతో ఏపీలో కలవరం రేపుతోంది. తమిళనాడులోని అన్నానగర్ పోలీస్ స్టేషన్లో పవన్ కల్యాణ్పై కేసు నమోదైంది.
తమిళనాడులోని మధురై పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీకి చెందిన న్యాయవాది వంజినాథన్ ఫిర్యాదు ఆధారంగా అన్నానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 196(1)(ఏ), 299, 302, 353(1)(బి)(2)ల కింద పవన్ కల్యాణ్పై కేసు నమోదు చేశారు. ఇటీవల మధురైలో మురుగన్ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ విద్వేషపూరిత ప్రసంగం చేశారని తమిళనాడులో తీవ్ర దుమారం రేపింది. ‘ఈ సమావేశాల్లో పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగాలు, తీర్మానాలు.. మతం, జాతి, ప్రాంతం ఆధారంగా సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించేవిగా, ఇతర వర్గాల మతపరమైన భావాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక సమావేశం ముసుగులో సామరస్యాన్ని రెచ్చగొట్టే లక్ష్యంతో బహిరంగ వ్యాఖ్యలు చేశారు’ అని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్తోపాటు అన్నామలైపై కూడా కేసు నమోదైంది.
సినీ నటి పాకీజాకు పవన్ కల్యాణ్ సహాయం
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి వాసుకి (పాకీజా)కి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆర్థిక సహాయం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిపోయిన పవన్ కల్యాణ్ రూ.2 లక్షలు ఇచ్చారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పాకీజాకు ఈ మొత్తాన్ని ప్రభుత్వ విప్ పి హరిప్రసాద్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అందజేశారు. తన ఆర్థిక పరిస్థితి గురించి పవన్ కల్యాణ్ స్పందించిన తీరుకు పాకీజా భావోద్వేగానికి లోనయ్యారు.
































