ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఈ తరుణంలో ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. తాజాగా మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు. శుక్రవారం ప్రకాశం జిల్లా నరసింహపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా బాలవీరాంజనేయస్వామి, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తుందన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికి సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నాం అన్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెంచి ప్రతి నెల 1వ తేదీన ఇంటింటికీ పంపిణీ చేస్తున్నాం. దీపం-2 పథకం మొదటి విడత డబ్బులు అకౌంట్లో జమ చేయడం జరిగిందన్నారు. అలాగే, తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.
ఈ తరుణంలో ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ప్రకటించారు. గతంలో సీఎం చంద్రబాబు కూడా ఈ జిల్లా ఏర్పాటు పై హామీ ఇచ్చారు. దీంతో ఎన్నో ఏళ్ల కల త్వరలోనే నెరవేరే అవకాశం ఉంది. కాగా మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటయ్యే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని చాలాకాలం నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలు మార్కాపురం జిల్లా ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్నారు.
































