ఐదు గ్రామాలు మాకు ఇవ్వాల్సిందే.. ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కవిత లేఖ

భద్రాచలం (Bhadrachalam) పట్టణాన్ని ఆనుకొని ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) డిమాండ్ చేశారు.


ఈ మేరకు గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయకుడి (AP CM Chandrababu Naidu)కి లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత పోలవరం ముంపు పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను చీకటి ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో విలీనం చేయించుకున్నారని ఆరోపించారు. దీంతో లోయర్ సీలేరు పనర్ ప్లాంట్‌ను లాగేసుకొని తెలంగాణలో కరెంట్ కష్టాలకు కారకులయ్యారని ఆరోపించారు. పోలవరం పేరుతో భద్రాచల శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయాన్ని ముంచేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏడు మండలాలను ఏకపక్షంగా విలీనం చేసుకోవడంతో భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్న.. పట్టణాన్ని ఆనుకొని ఉన్న యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

భద్రాచలం రాముల వారి గుడి మన్యం భూములు పురుషోత్తపట్నం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నాయని పేర్కొన్నారు. రాములవారు తెలంగాణలో ఉంటే ఆయన మన్యం భూములు ఏపీలో ఉండటంతో ఆ భూముల్లో ఇష్టారాజ్యంగా కబ్జాలు కొనసాగుతున్నాయని వివరించారు. కబ్జాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన భద్రాచలం రామాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవి పై కబ్జాదారులు దాడి చేసిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని వెల్లడించారు. రాముడి పేరు చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు భాగస్వామిగా ఉన్నారు.

అదే రాములవారు కొలువై ఉన్న భద్రాచలం పట్టణాన్ని పోలవరంలో ముంచేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఐదు గ్రామాల ప్రజలు విద్య, వైద్యం సహా ఇతర సేవలు పొందడానికి, ఉపాధిని అందిపుచ్చుకోవడానికి వందల కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడంతో పాటు భద్రాచలం రాముల వారి భూముల పరిరక్షణ కోసం వెంటనే యటపాట, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.