ఏపీలో ప్రమాదంలో ‘పొత్తు’.. ముందే మేల్కొంటున్న పవన్ కళ్యాణ్

జనసేన( Jana Sena ) నాయకత్వం కఠిన నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకుంది. మరోసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వనని పవన్ కళ్యాణ్ అల్టిమేట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.


అలా చేయాలంటే టిడిపి, జనసేన, బిజెపి బంధం దృఢపడాలి. అన్నింటికీ మించి మూడు పార్టీల శ్రేణుల మధ్య సమన్వయం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో పొత్తుకు విఘాతం కలగకూడదు. ముందుగా కింది స్థాయిలో క్రమశిక్షణ కచ్చితంగా పాటించాలి. ఇప్పుడు జనసేన అదే చేస్తోంది. పొత్తుకు విఘాతం కలిగించే నాయకులను పక్కన పెడుతోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరిన నేతల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటోంది.

* ఆ వైసీపీ మాజీ నేతలపై దృష్టి..
2024 ఎన్నికలకు ముందు.. ‘పవన్ అన్నకు జై కొడదాం.. జగనన్నకు ఓటేద్దాం’ అనే బ్యాచ్ ఉండేది. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో( Telugu Desam Party) పొత్తు వద్దని అన్ని విధాలా ప్రయత్నించింది ఈ బృందం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం జగన్మోహన్ రెడ్డిని అధికారం దూరం చేయాలంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీతో కలవాల్సిందేనని తేల్చి చెప్పారు. అటు భారతీయ జనతా పార్టీని సైతం కూటమిలోకి తెచ్చారు. టిడిపి తోనే కలుస్తానని తేల్చి చెప్పి.. నచ్చినవారు పార్టీలో ఉండండి.. నచ్చని వారు వెళ్లిపోవచ్చని కూడా తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. అయితే ఎన్నికలకు ముందు.. ఎన్నికల ఫలితాల తర్వాత అవసరాల కోసం చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జనసేనలోకి వచ్చారు. అయితే వారిలో కొందరికి ఇప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు ఉంది. అటువంటి వారి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి.

* మాజీ ఎమ్మెల్యే పై వేటు..
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, జనసేన ఇన్చార్జి టీవీ రామారావుపై( TV Rama Rao ) జనసేన నాయకత్వం వేటు వేసింది. ఇటీవల సహకార సొసైటీలకు సంబంధించి నియామకాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నియామకాల్లో జన సైనికులకు అన్యాయం జరిగిందంటూ టివి రామారావు ఆందోళన బాట పట్టారు. దీనిని గుర్తించిన జనసేన నాయకత్వం పొత్తుకు విఘాతం కలిగేలా వ్యవహరించినందుకు టీవీ రామారావు పై వేటు వేసింది. అయితే రామారావు పై వేటు జన సైనికులకు హెచ్చరికగా మిగిలింది. మున్ముందు పొత్తుకు విఘాతం కలిగించే ఎటువంటి ప్రయత్నాలు చేసినా మిగతా వారికి ఇదే పరిస్థితి అని హెచ్చరిక జారీ చేసింది జనసేన నాయకత్వం. ఇది భవిష్యత్తు పరిణామాలను ఊహించి చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

* జనసైనికులకు గట్టి హెచ్చరిక
కూటమి ( Alliance ) అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ఈ తరుణంలో అక్కడక్కడ అసంతృప్తులు రావడం సహజం. అయితే ఇదే అదునుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి కలిగిన నేతలు పావులు కదపడం ప్రారంభించారు. జనసైనికులు విషం నింపే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని ముందుగానే గుర్తించారు పవన్ కళ్యాణ్. అందుకే దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. మూడు పార్టీల మధ్య పదవులు, ప్రయోజనాలు అనేవి అంతర్గత విషయాలుగా భావిస్తున్నారు. వాటిని బహిర్గతం చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రం అందించే నేతలు అక్కర్లేదని భావిస్తున్నారు. అందుకే టీవీ రామారావు లాంటి జనసేన ఇన్చార్జిని సైతం పక్కన పెట్టారు. మున్ముందు పార్టీ క్రమశిక్షణ కట్టు దాటితే చర్యలు తప్పవని సంకేతాలు పంపగలిగారు జనసేన అధినేత.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.