మహిళా స్వయం సహాయక సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) శుభవార్త చెప్పింది. రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ (State Finance Department) సెర్ప్కు (SERP) నిధులు మంజూరు చేసింది. ఇందులో రూ. 300 కోట్లు గ్రామీణ మహిళ సంఘాలకు కేటాయించగా.. పట్టణ మహిళా సంఘాలకు రూ. 44 కోట్లు కేటాయించారు. రేపటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీలు జమ చేయనున్నారు.
ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేయనున్నారు. అలాగే ప్రమాద బీమా, లోన్ బీమా చెక్కులను సైతం పంపిణీ చేయనున్నట్లు తెలిసింది. వడ్డీలేని రుణాలు బీఆర్ఎస్ హయాంలో నిలిపోయిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ సర్కార్ అప్పట్లో సుమారు రూ. 3000 కోట్లకు పైగా బకాయిలు పెట్టింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వడ్డీలేని రుణాల చెల్లింపుపై నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మంత్రి సీతక్క చొరవతో మహిళా సాధికారతకు ఊతం లభించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
































