మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకి సంబంధించిన (MLC Teenmar Mallanna) క్యూ న్యూస్ కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేశారు.
మల్లన్న కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. దాడి సమయంలో పరిస్థితిని అదుపు చేసేందుకు మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొనడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఆఫీస్పై దాడి జరగడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. జర్నలిస్ట్ సంఘాలు, ప్రజా సంఘాలు ఈ దాడిని తీవ్రంగా ఖండిచాయి. మీడియా సంస్థలపై దాడులు చేయడం సరికాదని తీన్మార్ మల్లన్న అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని తీన్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
































