భారతీయులకు యూఐడీఏఐ కీలక సూచన చేసింది. పిల్లలకు ఏడేళ్ల వయసొచ్చినా ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయని తల్లిదండ్రులు వీలైనంత త్వరగా ఈ అప్డేషన్ పూర్తి చేయాలని స్పష్టం చేసింది (Aadhaar Child Biometric Update).
ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన ప్రకారం, తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లల బయోమెట్రిక్ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. పిల్లల తాజా ఫొటోతో పాటు పేరు, వయసు, పుట్టిన తేదీ, అడ్రస్ వివరాలను తగిన ధ్రువీకరణ పత్రాలతో సమర్పించాలి. అయితే, ఐదు ఏళ్ల లోపు వయసున్న పిల్లల చేతి వేలి ముద్రలు, ఐరిస్ వివరాలను యూఐడీఏఐ సేకరించదు. చిన్నారుల్లో ఇవి పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోకపోవడమే ఇందుకు కారణం. కేవలం పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ తదితరాలతోనే ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆధార్ కార్డు జారీ చేస్తారు.
ఇక ఐదేళ్ల దాటిన తరువాత తొలిసారిగా పిల్లల ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ వివరాలను తీసుకుంటారు. దీన్ని ఫస్ట్ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ (ఎమ్బీయూ) అని అంటారు. ఇక ఐదు నుంచి ఏడేళ్ల లోపు ఉన్న చిన్నారుల ఎమ్బీయూ పూర్తిగా ఉచితం. ఏడేళ్లు దాటితే మాత్రం బయోమెట్రిక్ అప్డేషన్ కోసం రూ.100 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఆధార్ నిబంధనల ప్రకారం, పిల్లలకు ఏడేళ్ల వయసొచ్చినా ఎమ్బీయూ పూర్తికాకపోతే వారి కార్డు డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎమ్బీయూ పూర్తికానీ పిల్లల తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తూ యూఐడీఏఐ మెసేజీలు పంపించడం కూడా ప్రారంభించింది. స్కూల్ అడ్మిషన్లు మొదలు ఎంట్రన్స్ పరీక్షల రిజిప్ట్రేషన్ వరకూ పిల్లలు ఎన్నో సేవలు పొందేందుకు ప్రస్తుతం ఆధార్ అవసరం. ఈ ప్రక్రియల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ఆధార్ వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.
































