కోహినూరు వజ్రం…. ప్రపంచంలోనే ఎంతో విలువైన వజ్రాల్లో ఒకటైన కోహినూరు కోసం ఎన్నో యుద్ధాలే జరిగాయి. అంతే కాదు ఈ వజ్రం చుట్టూ ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి.
మన తెలుగు నేలపై దొరికిన కోహినూర్… ఎన్నో రాజవంశాల చేతులు మారి,చివరకు బ్రిటన్ చేరుకుంది. అక్కడి రాజకుటుంబానికి వారసత్వ సంపదగా మారింది. అయితే కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారత్కు అప్పగించాలనే డిమాండ్ కూడా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ కోహినూర్ వజ్రం… తెలుగు నేలపై ఎక్కడ దొరికింది? బ్రిటన్ ఎలా చేరింది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రలో కోహినూర్ వజ్రం ప్రస్థావన ఉందా? వీరమల్లు ఏం చెప్పాడు అనేది తెలుసుకుందాం!
కోహినూర్ వజ్రం యెక్క మూలాలు,దాని చరిత్ర గురించి అనేక పురాణాలు, కథనాలు ఉన్నాయి. కోహినూర్ అనేది పర్షియన్ పదం.. భాషాపరంగా కోహ్-ఇ-నూర్ అని వ్రాయబడింది. దాని అర్థం ”కాంతి పర్వతం”. ఒడిశా స్టేట్ ఆర్కైవ్స్ ప్రకారం.. కాకతీయ రాజవంశం పాలనలో ఆంధ్రప్రదేశ్లోని నేటి గుంటూరు జిల్లాలోని కొల్లూరు గనిలో కోహినూర్ వజ్రం లభించినట్టుగా అంచనా.
”చాలా మంది చరిత్రకారులు కోహినూర్ వజ్రం కాకతీయ రాజవంశం పాలనలో భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని కొల్లూరు గనిలో తవ్వారని నమ్ముతారు. ఇది హిందూ ఆలయంలో దేవత కన్నుగా ప్రతిష్టించబడింది.14వ శతాబ్దం ప్రారంభంలో టర్కిక్ ఖిల్జీ రాజవంశం సైన్యం దోపిడి (యుద్ధ దోపిడీ) కోసం దక్షిణ భారతదేశంలోని రాజ్యాలపై దాడి చేయడం ప్రారంభించింది. 1310లో అల్లావుద్దీన్ ఖిల్జీ జనరల్ మాలిక్ కాఫుర్ వరంగల్పై విజయవంతమైన దాడి చేశాడు. అక్కడ అతను కోహినూర్ వజ్రాన్ని సంపాదించి ఉండవచ్చు” అని ఒడిశా స్టేట్ ఆర్కైవ్స్ వెబైసైట్ పేర్కొంది.
మరో కథనం ప్రకారం.. కాకతీయుల కాలంలో కోహినూర్ వజ్రం గోల్కొండ కోటలో ఉండేది. అయితే కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీ.శ. 1310లో ఢిల్లీ సుల్తాను పంపిన మాలిక్ కాఫుర్తో సంధి చేసుకుని అపారమైన సంపదతో పాటు, కోహినూర్ వజ్రాన్ని వారికి సమర్పించాడు.
ఆ తర్వాత కోహినూర్ వజ్రం.. ఒక రాజవంశం నుంచి మరొక రాజ వంశానికి చేరి చివరకు మొఘల్లకు చేరుకుంది. అక్కడ నుండి వజ్రం ఎలా చేతులు మారిందనేది చాలా స్పష్టంగా ఉంది. అలా ఢిల్లీ చేరిన కోహినూర్ వజ్రం పలు రాజవంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోఢీ చేతికి వచ్చింది. మొదటి పానిపట్టు యుద్ధంలో మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబర్ చేతిలో ఇబ్రహీం లోఢీ ఓటమి పాలై మరణించాడు. హిందుస్థాన్ను స్వాధీనం చేసుకున్న తర్వాత.. మొదటి మొఘల్ పాలకుడు బాబర్ కోహినూర్ను స్వాధీనం చేసుకున్నాడు. షాజహాన్ నెమలి సింహాసనాన్ని ప్రారంభించినప్పుడు.. అందులో వజ్రం పొదిగి ఉందని స్మిత్సోనియన్ మ్యాగజైన్ పేర్కొంది.
1739లో పర్షియన్ పాలకుడు నాదిర్ షా మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తి,వారిని ఓడించాడు. అప్పుడు ఢిల్లీని దోచుకున్నాడు. ఢిల్లీ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు శతాబ్దాలుగా పోగుచేసిన అపారమైన సంపదను ,కోహినూరు వజ్రాన్ని తీసుకువెళ్లాడు.
నాదిర్ షా నుంచి కోహినూర్ వజ్రం అహ్మద్ ఖాన్ అబ్దాలీతో ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ (1747-1856)లోని దుర్రానీ రాజ వంశానికి చేరుకుంది. నాదిర్ షా కమాండర్ అహ్మద్ ఖాన్ అబ్దాలీ కోహినూర్ను స్వాధీనం చేసుకున్నారు. అతను 1747లో మొదటి ఆధునిక ఆఫ్ఘన్ రాజ్యాన్ని స్థాపించాడు. వజ్రం దాదాపు ఏడు దశాబ్దాల పాటు అక్కడే ఉంటుంది. 1813లో అబ్దాలీ బహిష్కరించబడిన వారసుడు షా షుజా.. ఆశ్రయం కోసం కోహినూర్ను సిక్కు పాలకుడు మహారాజా రంజిత్ సింగ్కు అప్పగించారు. దీంతో కోహినూర్ వజ్రం భారతదేశానికి తిరిగి వచ్చింది. ఈ సమయంలోనే కోహినూర్ అంచనా విలువ బ్రిటిష్ వారిని ఆ వజ్రం వైపు ఆకర్షించింది.
బ్రిటీష్ వారి చేతికి కోహినూర్
1849లో రెండో ఆంగ్లో-సిక్కు యుద్ధంలో సిక్కు ఓటమి తరువాత, రంజిత్ సింగ్ వారసుడు దులీప్ సింగ్ యుద్ధం ముగింపులో ఒక ఒప్పందంలో భాగంగా కోహినూర్ను బ్రిటిష్ వారికి అప్పగించారు. 1851లో కోహినూర్ లండన్లోని గ్రేట్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచబడింది. ప్రదర్శన తర్వాత దాని రూపాన్ని మెరుగుపరచడానికి రాయిని కత్తిరించి పాలిష్ చేశారు. కోహినూర్ను కత్తిరించి పాలిష్ చేసిన తర్వాత అది కిరీట ఆభరణాలలో భాగమైంది. క్వీన్ విక్టోరియా దీనిని బ్రూచ్గా ధరించారు. ఆ తర్వాత సంవత్సరాలో కోహినూర్ వజ్రం.. రాజ కుటుంబీకుల కిరీటాలలో కూడా కనిపించింది
“హరిహర వీరమల్లు”లో కోహినూర్ వజ్రం ప్రస్థావన
పవన్ కళ్యాణ్ నటించిన ” హరిహర వీరమల్లు” చిత్రం కథ మొఘల్, కుతుబ్షాహీల కాలంలో జరుగుతుంది. ఆ కాలంలో కోహినూరు వజ్రం మొఘల్ సామ్రాజ్యం ఆధీనంలో ఉండేది. ఈ సినిమాలో వీరమల్లు (పవన్ కళ్యాణ్ ) పాత్ర ధనికుల నుండి సంపదను దోచుకుని పేదవాడికి పంచిపెట్టే రాబిన్ హుడ్ లాంటి క్యారెక్టర్ను పోలి ఉంటుంది. కోహినూర్ వజ్రం కోసం జరిగే కుట్రలు, పోరాటాల మధ్య వీర మల్లు పాత్ర ఉంటుంది.
































