స్కూల్‌కెళ్లిన ఇద్దరు బాలికలు తిరిగి ఇంటికి చేరుకోలేదు..ఆందోళన లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు

www.mannamweb.com


2024 జనవరి 29వ తేదీ.. ఎప్పటిలాగే స్కూలుకు వెళ్లేందుకు 14 ఏళ్ల వయస్సున్న ఇద్దరు బాలికలు హడావుడిగా తయారయ్యారు. పుస్తకాల సంచిని భుజాన వేసుకుని ఉదయం 8.30 గంటలకు వడివడిగా బయల్దేరారు.
సాధారణంగా సాయంత్రం 5 గంటలకల్లా ఇంటికి రావాలి. అయితే ఆరోజు ఆ ఇద్దరు బాలికలు సాయంత్రం దాటినా ఇంటికి రాలేదు. దీంతో ఆ ఇద్దరు బాలికల తల్లిదండ్రులు ఆందోళనతో స్కూల్, స్నేహితుల ఇళ్లల్లో వాకబు చేశారు. అసలు ఆరోజు వాళ్లిద్దరూ స్కూల్‌కు రాలేదని తెలిసింది. దీంతో ఆ బాలికల తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. 14 ఏళ్ల వయస్సున్న తమ ఆడపిల్లల్ని వెతికి పెట్టాల్సిందిగా పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన ఖాకీలు అదృశ్యమైన బాలికల కోసం గాలిస్తున్నారు. నేటికి ఐదు రోజులైనా బాలికల ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులతో పాటు ఆ గ్రామం ఆందోళనలో ఉన్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఫారం గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జనవరి 29వ తేదీన కుటుంబసభ్యులకు స్కూల్‌కి వెళ్లి వస్తామని చెప్పి వెళ్లిన ఇద్దరు బాలికలు తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబసభ్యులు, గ్రామంలోని స్థానిక పరిసర ప్రాంతాలు.. వారి బంధువుల ఇళ్లలో అన్వేషించి.. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

రాచర్ల మండలం ఫారం గ్రామానికి చెందిన మీనిక చరిత(14), రాచర్లలోని జడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతుండగా.. సోడా నారాయణమ్మ(13) రాచర్ల మోడల్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. వీరిద్దరూ స్నేహితులు కావడంతో ప్రతిరోజు కలిసి పాఠశాలకు వెళ్లి వస్తున్నారు. జనవరి 29వ తేది ఉదయం కూడా అలాగే వెళ్లినవారు.. తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో బాలికలు అదృశ్యంపై ఇద్దరి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇప్పటికీ వారి ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసలు తమ పిల్లలు బతికే ఉన్నారా..? అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. వెంటనే తమ పిల్లల్ని వెతికి తమకు అప్పగించాలని వేడుకుంటున్నారు.