UPI యూజర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ఆ ఫీచర్ తొలగింపు.. ఇక అలా చేయలేరు

దేశీయ డిజిటల్ పేమెంట్ల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. నిత్యం కోట్లలో లావాదేవీలు జరుగుతున్నాయి.


ఈ క్రమంలో యూపీఐ పేమెంట్ల వ్యవస్థను ఎప్పటికప్పుడూ ఆధునికీకరిస్తూ వస్తోంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI). యూజర్ల భద్రతే లక్ష్యంగా కొత్త కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెస్తోంది. అయితే, ఈసారి అందుకు భిన్నంగా ఇప్పటికే అందుబాటులో ఉన్న కలెక్ట్ రిక్వెస్ట్ అనే ఫీచర్‌ను త్వరలోనే నిలిపివేయనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

అక్టోబర్ 1, 2025 నుంచి యూపీఐ యాప్స్‌లో కలెక్ట్ రిక్వెస్ట్ (రిక్వెస్ట్ మనీ) ఫీచర్ నిలిపివేయాలని బ్యాంకులు, పేమెంట్ యాప్స్‌కు ఎన్‌పీసీఐ సూచించింది. ఈ మేరకు ఇటీవలే ఓ సర్క్యూలర్ జారీ చేసింది. అక్టోబర్ 1 లోపు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, యూపీఐ యాప్స్ తమ సిస్టమ్స్‌లో తగిన విధంగా మార్పులు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ కనుమరుగు కానుంది.

ఎన్‌పీసీఐ ఆదేశాల మేరకు గడువు ముగిసిన తర్వాత బ్యాంకులు, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ ద్వారా సేవలందించకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కలెక్ట్ ట్రాన్సాక్షన్లను ప్రాసెసింగ్ చేయకూడదు. సాధారణంగా ఎవరు నుంచైనా యూపీఐ యాప్స్ ద్వారా నగదు స్వీకరించేటప్పుడు పిన్ నంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ, డబ్బులు పంపించామన్న కారణం చూపుతూ కొందరు మోసగాళ్లు యూపీఐ పిన్ ఎంటర్ చేయిస్తూ డబ్బులు కొట్టేస్తున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. ఈ విషయం ఎన్‌పీసీఐ దృష్టికి వచ్చిన క్రమంలోనే ఈ మేరకు రిక్వెస్ట్ మనీ ఫీచర్ తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ ద్వారా మోసాలు జరుగుతున్నాయని తెలిసిన క్రమంలో 2019లోనే ఫుల్ ట్రాన్సాక్షన్లలో గరిష్ఠ లిమిట్ రూ.2 వేలకు పరిమితం చేసింది ఎన్‌పీసీఐ. అయినప్పటికీ ఈ మనీ రిక్వెస్ట్ ఫీచర్‌తో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు అమాయకులు కేటుగాళ్ల బారినపడి మోసపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ కలెక్ట్ రిక్వెస్ట్‌ సేవలకు పూర్తిగా చరమగీతం పాడాలని ఎన్‌పీసీఐ నిర్ణయించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఇక ఆ ఫీచర్ కనబడదు. ఎవరైనా డబ్బులు పంపించాం అంటూ అలాంటి మెసేజ్‌ చేసే అవకాశం ఉండదు. అలా రిక్వెస్ట్ మనీ మెసేజ్ చేస్తూ మోసాలు చేస్తున్న వారికి చెక్ పడినట్లవుతుంది. అయితే, కొన్నిసార్లు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని యూపీఐ యూజర్లు చెబుతుంటారు. అయితే, లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నందున తొలగించినట్లు సమాచారం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.