ప్రారంభించిన నిమిషాల్లోనే.. సముద్రంలో మునిగిపోయిన లగ్జరీ నౌక

తుర్కియే (Turkey)లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ప్రారంభించిన నిమిషాల్లోనే ఓ లగ్జరీ నౌక (Luxury Yacht) సముద్రంలో మునిగిపోయింది.


ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన జోంగుల్డక్‌ (Zonguldak) తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

దాదాపు 1 మిలియన్ డాలర్లతో ఈ లగ్జరీ నౌకను నిర్మించారు. దీని ఖరీదు భారత కరెన్సీలో దాదాపు 8.74 కోట్లన్నమాట. 24 మీటర్ల పొడవున్న ఈ లగ్జరీ నౌకకు డోల్స్‌ వెంటో (Dolce Vento) అని పేరు పెట్టారు. తుర్కియేలోని మెడ్ యిల్మాజ్ షిప్‌యార్డ్‌లో మంగళవారం ఈ నౌక్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు. కొంత మంది ప్రయాణికులు, సిబ్బందితో నౌక సముద్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే, ప్రారంభమైన 15 నిమిషాలకే ఈ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఊహించని ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు, సిబ్బంది వెంటనే సముద్రంలోకి దూకేశారు. అనంతరం సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.

యజమాని, కెప్టెన్‌ కూడా సముద్రంలో దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనలో ఆ నౌకలోని వారందరూ సురక్షితంగా బయటపడినట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. నౌక మునిగిపోతున్న దృష్యాలు అక్కడే ఒడ్డున ఉన్న కొందరు తమ కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతోంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.